Passion Fruit Cultivation : కృష్ణఫలం, వెన్నపండు అంటే తెలియకపోవచ్చు. పేషన్ ఫ్రూట్, అవకాడో అని చెబితే ఇట్టే అర్థమైపోతుంది. సంప్రదాయ పంటలను వదిలేసి ఎక్కడో బ్రెజిల్, మెక్సికో దేశాల్లో పండే పరదేశీ పండ్ల సాగునే నమ్ముకున్నాడు వార్కీ జార్జ్(Varkey George). ఇందుకోసం బంగారం లాంటి అమెరికా ఉద్యోగాన్నీ వదులుకున్నాడు.
రైతు కుటుంబానికి చెందిన జార్జి చిన్నతనం అంతా కేరళలోని కూటిక్కళ్లోనే గడిచింది. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన జార్జ్ ఆరేళ్ల పాటు అమెరికాలోనే ఉద్యోగం చేశాడు. ఆ సమయంలోనే అతని కుటుంబం తమిళనాడులోని తేని పట్టణ సమీపంలో 170 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
ఆ తర్వాత కొద్దికాలానికే కొలువుకు గుడ్బై చెప్పేసి.. వ్యవసాయ క్షేత్రాన్ని చూసుకునేందుకు 2011లో ఇండియాకు వచ్చేశాడు. తమిళనాడులో ఎన్నో ఏళ్లుగా కూరగాయలు, కొబ్బరి వంటి సంప్రదాయ పంటలనే వేస్తూ వచ్చారు. దీని వల్ల పెద్దగా ఆదాయం ఉండేది కాదు. పాత చింతకాయ పచ్చడిలాంటి ఈ విధానానికి స్వస్తి పలికి పండ్ల తోటల సాగు చేపట్టాలనే నిర్ణయానికొచ్చాడు జార్జ్.
వ్యవసాయం అంటే సవాళ్లతో కూడిన విషయమన్న సంగతి జార్జ్కు తెలుసు. రిస్క్లు ఉంటాయి. ఒకసారి తప్పు జరిగిందా.. సరిదిద్దుకోవడానికి ఏడాది పాటు వేచి చూడాల్సి ఉంటుందని చెప్పాడు. 15 ఎకరాల్లో కొబ్బరి తోట ఉన్నా.. పదేళ్లుగా ఒక్కో కాయ రూ.10 చొప్పునే అమ్ముడుపోతోందని, అమ్మకం ధరలో పెద్ద మార్పేమీ లేదని చెప్పాడు. కూరగాయలు కిలో రూ.12-35 మించి ధర పలకడం లేదన్నాడు.
మరో వైపు ఏటా ఉత్పత్తి, లేబర్ ఖర్చులు పదిశాతం చొప్పున పెరుగుతుండటంతో జార్జ్ కొత్త బాట పట్టాడు. అధిక విలువ ఉన్న పండ్ల సాగే బెటర్ అనుకున్నాడు. అతను, అతని స్నేహితులు కొందరు ఆరేళ్లుగా పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. వారికి మెరుగైన ఫలితాలే కనిపించాయి. 3 ఎకరాల్లో లోంగాన్, 7 ఎకరాల్లో మేయర్ లెమన్, ద్రాక్ష, 6 ఎకరాల్లో పేషన్ ఫ్రూట్ వంటి పరదేశీ తోటల పెంపకం చేపట్టాడు. అలాగే పైలట్ ప్రాజెక్టు కింద 30 అవకాడో మొక్కలను నాటాడు.
వాస్తవానికి ఈ తరహా పండ్ల తోటల పెంపకం దేశంలో ఇంకా మొగ్గదశలోనే ఉన్నదని జార్జ్ చెబుతాడు. గత రెండేళ్లుగా పేషన్ ఫ్రూట్ సాగు చేస్తున్నామని, ఎకరానికి 5 టన్నుల చొప్పున మొత్తం 30 టన్నుల దిగుబడి నిరుడు వచ్చిందని అతను వివరించాడు. కిలో పళ్లు రూ.75-85 చొప్పున విక్రయించారు. ఈ లెక్కన ఎకరానికి రూ.4.15 లక్షల ఆదాయాన్ని పొందగలిగారు. అవకాడోలను కిలోకి రూ.300-400 చొప్పున విక్రయించారు. జనవరిలో లోంగాన్, జూన్ లో ద్రాక్షపంట చేతికి రానుంది. ఈ రెండింటికీ ధర కిలోకి రూ.300 చొప్పున రావొచ్చని ఆశాభావంతో ఉన్నాడు జార్జ్.