KTR Press Meet : మునుగోడు గెలుపుతో కొత్త చరిత్ర లిఖించామని.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లు టీఆర్ఎస్ వే అంటూ విజయ నినాదం చేశారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కారు గెలుపునకు కృషి చేసిన లెఫ్ట్ పార్టీలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి, ఆత్మ గౌరవానికి మునుగోడు ఓటర్లు పట్టం కట్టారని అన్నారు.
రోడ్ రోలర్, చపాతీ మేకర్ లాంటి కారును పోలిన గుర్తులకు సుమారు 6వేల ఓట్లు వచ్చాయని.. ఈసీతో కలిసి బీజేపీ కుట్ర చేసిందని.. లేదంటే తమ మెజార్టీ మరింత పెరిగి ఉండేదని కేటీఆర్ చెప్పారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డియే అయినా.. మునుగోడులో ఆట ఆడించిందంతా మోదీ, అమిత్ షాలే అన్నారు. 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి.. తెలంగాణ సర్కారునూ కూలగొట్టాలని చూసిన బీజేపీకి మునుగోడు ప్రజలు గట్టి బుద్ధి చెప్పారన్నారు కేటీఆర్.
మునుగోడులో బీజేపీ పార్టీ వందల కోట్లు ఖర్చు చేసిందని.. ప్రచారం సమయంలో దొరికన డబ్బు అంతా బీజేపీ నాయకులవేనని గుర్తు చేశారు. 15 కంపెనీల కేంద్ర బలగాలను, 40 ఐటీ బృందాలను కేంద్రం మోహరించి ఎన్నికల్లో ఏదో జరిగిపోతున్నట్టు సీన్ క్రియేట్ చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ఈటల రాజేందర్ వల్ల హుజురాబాద్ లో, రాజగోపాల్ రెడ్డి వల్ల మునుగోడులో ఎన్నికలు ధనమయం అయ్యాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అనేక ఫేక్ ప్రచారాలు క్రియేట్ చేశారని.. బీజేపీ ఫేక్ పార్టీ అని అన్నారు కేటీఆర్.