MLC Elections : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 11న నోటిఫికేషన్ రాగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల స్వీకరణకు ఇవాళ చివరి రోజు. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఈ నెల 22 వరకు ఉపసంహరణ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నెల 29న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెల్లడికానున్నాయి. నామినేషన్ల గడువు ఇవాళ్టితో ముగియనుండగా.. ఇప్పటి వరకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థులు మహేశ్కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్లు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. మూడు రోజులుగా అభ్యర్థుల ఎంపిక.. హస్తం పార్టీలో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ఈ నేపథ్యంలో ముందుగా అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ను ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. చివరి క్షణాల్లో అద్దంకి స్థానంలో మహేశ్కుమార్ గౌడ్ పేరును తీసుకొచ్చింది కాంగ్రెస్. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్తో చర్చించి.. అధికారికంగా అభ్యర్థులను ప్రకటించింది. ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ పదవులకు 2027 నవంబరు 30 వరకు గడువు ఉండగా.. రెండింటికి విడివిడిగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో అత్యధిక బలం కలిగిన కాంగ్రెస్కే రెండు ఎమ్మెల్సీలు దక్కనుండటంతో.. ఆ పార్టీ నిర్ణయించిన మహేశ్కుమార్గౌడ్, బల్మూరి వెంకట్ల ఎన్నిక లాంఛనం కానుంది.
అయితే.. చివరి క్షణంలో పేరు మార్చటంపై స్పందించారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. పార్టీ నిర్ణయానికి తానేమీ చింతించడంలేదని.. తాను కాంగ్రెస్కు విధేయుడినని.. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ కోసం సహనంతో ఉంటానని.. తనకు మరింత మంచి స్థానం ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచిస్తోందన్నారు అద్దంకి దయాకర్.