T20 WORLDCUP: టీ20 వరల్డ్ కప్ లో భారత్ సెమీస్ లోకి ప్రవేశించింది. చివరి లీగ్ మ్యాచ్ లో జింబాబ్వేను 71 పరుగుల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. తొలుత బ్యాంటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ ( 51 పరుగులు) మరోసారి హాఫ్ సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్ 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేను భారత్ బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆ జట్టులో సికిందర్ రాజా 34 పరుగులు, ర్యాన్ బర్ల్ 35 పరుగులతో కాసేపు మెరుపులు మెరిపించారు. భారత్ బౌలర్లు చెలరేగడంతో జింబాబ్వే 17.2 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయ్యింది. భారత్ బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా..షమీ, పాండ్యా తలో రెండు వికెట్లు, భువనేశ్వర్, అర్షదీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు. అద్భుతంగా బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ యాదవ్ కు ఫ్లేయర్ ఆఫ్ మ్యాచ్ అవార్డు దక్కింది.
జింబాబ్వేపై విజయంతో భారత్ జట్టు గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ ల్లో నాలుగు విజయాలు సాధించిన రోహిత్ సేన సెమీస్ లో గ్రూప్-1లో రెండోస్థానంలో ఉన్న ఇంగ్లాండ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ నవంబర్ 10న జరుగుతుంది. నవంబర్ 9న జరిగే తొలి సెమీస్ లో న్యూజిలాండ్ , పాకిస్థాన్ జట్లు తలపడతాయి. పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ కు చేరింది. అంతకు ముందు జరిగిన మరో మ్యాచ్ లో దక్షిణాఫ్రికా అనూహ్యంగా నెదర్లాండ్స్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ కు సెమీస్ బెర్త్ దొరికింది.