బెంగళూరులో ఆఫ్గాన్ తో జరిగిన మూడో టీ 20 లో రోహిత్ శర్మ విధ్వంసం సాగింది. అది అలా ఇలా కాదు సిక్సర్లతో స్టేడియం దద్ధరిల్లిపోయింది. ఒకొక్క సిక్సర్ అయితే స్టేడియం అవతల పడుతుందా? అన్నంత ఎత్తులో ఎగిరాయి. కొడుతున్నంత సేపు కళ్లార్పకుండా చూడటం అందరి వంతు అయ్యింది. ఇది నిజమా? కలా? అన్న రీతిలో రోహిత్ శర్మ ఆట సాగింది.
తననెందుకు హిట్ మ్యాన్ అంటారో, మరోసారి నిరూపితమైంది. ఈ ఒక్క సెంచరీతో దెబ్బకి అందరి నోళ్లూ రోహిత్ శర్మ మూయించాడని నెట్టింట కామెంట్లు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కి ఇది తీరని అవమానమేనని అంటున్నారు.
22 పరుగులకే టీమ్ ఇండియా కీలకమైన 4 వికెట్లు పడిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. రింకూసింగ్ (69 నాటౌట్) సహాయంతో స్కోరుబోర్డుని పరుగులెత్తించాడు.
రోహిత్ శర్మ వ్యక్తిగతంగా, టీమ్ ఇండియా పరంగా సాధించిన రికార్డులు ఇవే.
రోహిత్ శర్మ టీ 20ల్లో ఐదో సెంచరీ చేసిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. తన తర్వాత స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (4), మ్యాక్స్ వెల్ (4) ఉన్నారు.
టీ 20లో రోహిత్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా సాధించిన 42వ విజయం. దీంతో మహేంద్ర సింగ్ ధోనీ సరసన రోహిత్ నిలిచాడు. తను కూడా కెప్టెన్ గా 42 విజయాలు సాధించాడు.
టీ 20 సిరీస్ లు తొమ్మిదింటిని వైట్ వాష్ చేసి నెంబర్ వన్ స్థానంలో టీమ్ ఇండియా నిలిచింది. పాకిస్తాన్ 8 సిరీస్ లను వైట్ వాష్ చేసి రెండో స్థానంలో ఉంది.
అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్ గా అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్గా రోహిత్ శర్మ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచులో 8 సిక్సర్లు కొట్టడమే కాదు, రెండు సూపర్ ఓవర్లలో కలిపి మరో 3 సిక్సర్లు కొట్టాడు. ఇలా చూస్తే, ఈ మ్యాచ్ లో 11 సిక్సర్లు కొట్టినట్టు లెక్క.
ఇక మొత్తంగా టీ20 కెప్టెన్గా 93 సిక్సర్లు కొట్టి నెంబర్ వన్ కెప్టెన్ గా ఉన్నాడు. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (86 సిక్సులు), ఆసీస్ మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ (82) ఉన్నారు.
టీ 20లో ఐదో వికెట్ కు 190 పరుగుల భాగస్వామ్యాన్ని రోహిత్ శర్మ- రింకూ సింగ్ జంట నమోదు చేసింది. ఇలా కూడా ఒక రికార్డ్ స్రష్టించింది. ఇంతకుముందు విరాట్ కొహ్లీ-హార్దిక్ పాండ్యా 113 పరుగుల రికార్డ్ ను వీరు బ్రేక్ చేశారు.
ఆఫ్గనిస్తాన్-ఇండియా మధ్య జరిగిన టీ 20 మ్యాచ్ లో మొత్తం 424 పరుగులు రెండు జట్లు చేశాయి. ఇది ఈ రెండు జట్ల మధ్య అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఈ మ్యాచ్లో చివరి ఓవర్ లో రోహిత్ శర్మ తొలి మూడు బంతుల్లో ఓ ఫోర్, రెండు సిక్స్లు బాదగా.. రింకూ సింగ్ చివరి మూడు బంతుల్లో హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. కరీమ్ జనత్ ఒక నోబాల్ వేయడంతో టీమిండియా చివరి ఓవర్లో 36 పరుగులు చేసింది.
అంతర్జాతీయ టీ 20లో ఓకే ఓవర్లో 36 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రింకూ సింగ్తో కలిసి రోహిత్ శర్మ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో 6 బంతుల్లో 6 సిక్స్లు బాదిన యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్.. తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.. రోహిత్-రింకూ మూడో స్థానంలో నిలిచారు.
భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన నాల్గవ బ్యాటర్గా రోహిత్ శర్మ(121*) ఉన్నాడు. శుభ్మన్ గిల్(126*) మొదటి స్థానంలో ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్(123*), విరాట్ కోహ్లీ (122*) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
22 పరుగులకే 4 వికెట్లు పడిపోయిన దశలో రోహిత్ శర్మ, రింకూ సింగ్ ఇద్దరూ కూడా ప్రతీ బాల్ ని కొడుతున్నప్పుడల్లా చూసినవాళ్లంతా టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎందుకంటే బాల్ సిక్స్ వెళ్లిందా? లేక అవుట్ అయిపోయారా? అనే ఆందోళనలోనే మ్యాచ్ అంతా గడిపారు. ఎందుకంటే అప్పటికే 4 వికెట్లు పడిపోయాయి. ఇక ఏ మాత్రం ఒకరు అవుట్ అయినా మ్యాచ్ పోయినట్టేననే భావనతోనే చివరి వరకు కన్నార్పకుండా చూశారు.