TRS Victory in Munugode : కాంగ్రెస్ కంచుకోటలో గులాబీ జెండా ఎలా ఎగిరింది? కేసీఆర్ పాలనే గెలిపించిందా? లేక, ప్రలోభాలే పట్టం కట్టాయా? మునుగోడులో బీఆరెస్ కు పునాది పడిందా? ఇలా అనేక ఆసక్తికర విశ్లేషణలు జరుగుతున్నాయి. మునుగోడు ఉపఎన్నికలో టీఆరెస్ విజయం సాధించింది. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఏం సంకేతాలు ఇస్తున్నది. ఇది టీఆరెస్ , సీఎం కేసీఆర్ పాలన పట్ల ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ గానే భావించొచ్చా? ఎన్నికల్లో డబ్బు , మద్యం , ప్రలోభాలు ఏ రేంజ్ లో జరిగాయో అందరికీ తెలిసిందే. ఏకంగా ప్రజలు ఓటుకు నోట్లు ఇవ్వాలని ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. అయినా సరే టీఆరెస్ అభ్యర్థి విజయం సాధించడంలో అనేక అంశాలు ప్రభావం చూపాయి.పోల్ మేనేజ్ మెంట్ లో కారు పార్టీ పట్టు సాధించింది.
మొదటి నుంచి మునుగోడు ఉపఎన్నికలను.. ప్రజలపై బలవంతంగా రుద్దిన తతంగానే టీఆరెస్ ప్రొజెక్ట్ చేసింది. రాజగోపాల్ , బీజేపీ స్వార్థం కోసం వచ్చిన ఎన్నికగా .. మునుగోడు బైపోల్ ను ప్రజల్లోకి తీసుకెళ్లింది. 18వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటి రెడ్డి రాజగోపాల్ .. తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశాడన్న హస్తం పార్టీ ప్రచారం కూడా టీఆరెస్ కు యాడెడ్ అడ్వాంటేజీ అయింది. దీనికి తోడు సోషల్ మీడియాలో బీజేపీకి వ్యతిరేకంగా.. రాజగోపాల్ ఫొటోతో ఫోన్ పే క్యూ ఆర్ కోడ్ స్కాన్ ప్రచారాలు జనాలను అట్రాక్ట్ చేశాయి. మరోవైపు రాజగోపాల్ అన్నయ్య .. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆడియో లీకేజీలు , ఆస్ట్రేలియా వెళ్తూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్ల వీడియోలు కూడా జనాలను ప్రభావితం చేశాయి. ఐతే.. ఇవన్నీ కాంగ్రెస్ కు కాకుండా గులాబీపార్టీకి అనుకూలంగా మారడంతో.. కారు రయ్యిన దూసుకెళ్లింది.
బూరనర్సయ్య గౌడ్ లాంటి బీసీ నేతను తన పార్టీలో చేర్చుకొని.. టీఆరెస్ ను బీసీ వ్యతిరేకిగా నిలబెట్టాలని పథకం వేసింది. ఐతే… కేసీఆర్ ఈ తుఫానులో కొట్టుకుపోకుండా తన వ్యూహాన్ని అమలుచేశాడు. బీజేపీ నుంచి ముగ్గురు ఉద్యమ నేతలను తిరిగి టీఆరెస్ లో చేర్చుకున్నాడు. బీజేపీ ఈగోపై దెబ్బకొట్టాడు. ఊహించని ఈ పరిణామంతో ఇటు రాష్ట్ర బీజేపీ, అటు కేంద్ర సర్కారుకు షాక్ తగిలింది. ఆ తర్వాత మొయినాబాద్ ఫామ్ హౌస్ లో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఇప్పటికీ దీనిపై అనేక అనుమానాలున్నా.. రాష్ట్రంలో సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ప్రజలను నమ్మించడంలో కేసీఆర్ ప్లాన్ సక్సెస్ అయింది. ఇది బీజేపీకి మైనస్ గా మారింది.
తెలంగాణ రాష్ట్ర సమితిని.. భారత రాష్ట్ర సమితిగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ఎన్నికల సంఘం ఆమోదం పడక ముందే మునుగోడు ఉపఎన్నిక ఎన్నిక వచ్చింది. ఓ రకంగా ఇది టీఆర్ఎస్కు సవాలే. ఉపఎన్నికలో గెలవకపోతే.. బీఆర్ఎస్ కు ఈసీ అనుమతి లభించినా ఎలాంటి హైప్ ఉండదు. మొదట్లోనే అదీ కూడా సొంత రాష్ట్రంలో ఉపఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ దేశవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపిస్తుందని తేలిగ్గా తీసుకునేవారు. కానీ బీఆరెస్ కు పునాది వేసే అవకాశం మునుగోడుకే దక్కిందని .. ఉపఎన్నికలో గెలిపించి ఆశీర్వదించాలంటూ స్వయంగా కేసీఆర్ రెండు బహిరంగ సభలు పెట్టి మరీ జనాలను విజ్ఞప్తి చేశారు. ఇది కూడా కలిసి రావడంతో.. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఇప్పుడు బీఆర్ఎస్ను టాప్ గేర్ లో దేశ రాజకీయాల్లోకి దూకించడానికి కేసీఆర్కు కావాల్సినంత బలం సమకూరింది.