Ambati Rambabu | సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయనకు ఈ సారి టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. నాన్ లోకల్ అయిన అంబటిని పంపిచేయాలని .. సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్ వైసీపీలో బలంగా వినిపిస్తోంది.
సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుపై సొంత పార్టీలోనే వ్యతిరేకత పెరిగిపోతోంది. ఆయనకు ఈ సారి టికెట్ ఇస్తే ఓడిస్తామని నియోజకవర్గ అసమ్మతి నేతలు అల్టిమేటం ఇస్తున్నారు. నాన్ లోకల్ అయిన అంబటిని పంపిచేయాలని .. సత్తెనపల్లి టికెట్ స్థానికులకే ఇవ్వాలన్న డిమాండ్ వైసీపీలో బలంగా వినిపిస్తోంది. తాజాగా సంక్రాంతి సంబరాల్లో అమాత్యుడు చిందులు వేసిన సందర్భంగా పార్టీ వర్గాల అసంతృప్తి మరోసారి బహిర్గతమైంది.
మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా సొంత నియోజకవర్గం సత్తెనపల్లిలో అసమ్మతి వర్గం సమావేశాలు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి ఇంట్లో అసమ్మతి నాయకులు సమావేశమయ్యారు. యర్రం మద్దతు కోరారు. అధిష్ఠానం అదేశిస్తే పోటికి సిద్ధమని యర్రం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. సత్తెనపల్లి ఎమ్మెల్యే సీటును స్థానికులకు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. అప్పుడెప్పుడో 30 ఏళ్ల క్రితం రేపల్లెలో ఒక సారి గెలిచిన అంబటిని తెచ్చి తమ తలమీద రుద్దారని.. ఇకపై సత్తెనపల్లిలో అంబటి పేరు వినపడకూడదని .. అంబటికి సీటు ఇస్తే రాజీనామాలు చేస్తామని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో అంబటి పోటిచేస్తే ఓడిస్తామని స్పష్టం చేశారు.
వైసీపీ పార్టీ కోసం కష్టపడ్డ అందరినీ అంబటి రాంబాబు ఇబ్బంది పెట్టారని అసమ్మతి నేతలు వాపోతున్నారు. అంబటి వద్దు, జగన్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. సంక్రాంతి సంబరాల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి రాంబాబు.. సంబరాల రాంబాబుగా మారిపోయారని, అలాంటి మంత్రి తమకు వద్దు అని ప్రత్యర్థి వర్గం డిమాండ్ చేస్తుండటం గమనార్హం . ఇక పెదమక్కెన ఎంపీటీసీ యంపాటి విజయలక్ష్మి అయితే.. సంబరాల రాంబాబు నీకు ఇవే చివరి సంబరాలంటూ ఎద్దేవా చేశారు. తమ ఉసురు కొట్టుకొని నాశనం అవుతావని శాపనార్ధాలు పెట్టారు.