Sharmila fights Jagan | ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి. ఎవరెవరు పార్టీలో ఉంటారో ఊహించలేని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో అభ్యర్ధుల మార్పులు చేర్పులు ఎఫెక్ట్తో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు .. ముఖ్యంగా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టడం అధికారపక్షానికి మింగుడుపడకుండా తయారైందంటున్నారు .
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రంజుగా తయారయ్యాయి. ఎవరెవరు పార్టీలో ఉంటారో ఊహించలేని ట్విస్ట్లు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో అభ్యర్ధుల మార్పులు చేర్పులు ఎఫెక్ట్తో అసంతృప్తితో రగిలిపోతున్న నేతలు .. ముఖ్యంగా సిట్టింగ్ ప్రజాప్రతినిధులు పక్కచూపులు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల బాధ్యతలు చేపట్టడం అధికారపక్షానికి మింగుడుపడకుండా తయారైందంటున్నారు . ఏపీ పాలిటిక్స్లో షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంటే.. వైసీపీ అసంతృప్తి నేతలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తుండటం విశేషం. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు, సొంత అన్న అయిన జగన్ని షర్మిల ఢీ కొట్టడానికి రెడీ అవ్వడం అసక్తి రేపుతోందిప్పుడు.
ఏపీలో కాంగ్రెస్కు పూర్వ వైభవం వచ్చేలా నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేస్తానని ఏపీసీసీ చీఫ్ షర్మిల పేర్కొన్నారు. ఎంతో నమ్మకంతో పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను అంతే నమ్మకంతో నిర్వర్తిస్తానని ఆమె తాజాగా ట్వీట్ చేశారు. మాజీ పీసీసీ చీఫ్, ప్రస్తుత సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజుతో పాటు క్షేత్రస్థాయిలోని కార్యకర్తల నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరి అనుభవాలు, ఆలోచనలు తెలుసుకొని పార్టీని బలోపేతం చేస్తానంటున్నారు.
ఏపీసీసీ అధ్యక్షురాలిగా సీఎం జగన్ సోదరి షర్మిల నియామకంతో పొలిటికల్ ట్విస్ట్లు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. తండ్రి వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంపై యుద్దం ప్రకటించి వైసీపీని స్థాపించారు జగన్. వైఎస్ సెంటిమెంటుని వాడుకుని .. ఒక్క ఛాన్స్ .. అంటూ పవర్లోకి రాగలిగారు. గత రెండు ఎన్నికల్లో రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ఏపీలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కాంగ్రెస్.. రానున్న ఎన్నికల్లో సత్తా చాటుకోవడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందులో భాగంగా జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పింది.
జగనన్న వదిలిన బాణాన్ని.. అని తన పాదయాత్రల్లో హోరెత్తించిన షర్మిల.. ఏపీలో 2019లో జగన్ అధికార పీఠమెక్కే వరకు రాజకీయంగా ఆయనకు అండగా ఉన్నారు. ఆ తరవాత వచ్చిన విభేదాల కారణంగా ఆమె తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని అక్కడే కొనసాగారు. పక్క రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఆమె కొంతకాలంగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఆమె విమర్శలు చేశారు. ఆంధ్రలో రహదారులు అత్యంత అధ్వానంగా ఉన్నాయని, తెలంగాణలో రోడ్లతో పోలుస్తూ అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై.. ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలపై అప్పుడే విమర్శనాస్త్రాలు సంధించారు.
తెలంగాణలో ఉంటూ ఏపీలో జగన్ సర్కారు తీరుపై స్పందించిన ఆమె.. ఇప్పుడు ఏకంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టి జగన్ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా ఢీ కొట్టడానికి రెడీ అయ్యారు. తెలంగాణలో వైటీపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు ఆమె కేసీఆర్ సర్కారును ఏ రేంజ్లో చీల్చి చెండాడారో ప్రత్యేక్షంగా చెప్పనవసరం లేదు. ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి .. అదీ ఎన్నికల ముందు పీసీసీ ప్రెసిడెంట్గా ఎంట్రీ ఇవ్వడంతో .. వైసీపీ ప్రభుత్వంపై ఆ విమర్శల డోసు మరింత పెంచుతారనడంలో సందేహం లేదు. కాంగ్రెస్ హైకమాండ్ బద్ద శత్రువులా చూసే తన అన్నని .. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమె టార్గెట్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.
ఇక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, క్రిస్టియన్ వర్గాలు తమ సొంతమని భావించే వైసీపీ ఓటు బ్యాంకుపైనా షర్మిల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పార్టీని పునర్నిర్మించి పూర్వవైభవం తీసుకొస్తానని షర్మిల ఇటీవల ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసినప్పుడు చెప్పారు. రాహుల్గాంధీని ప్రధానిగా చూడాలనేది తన తండ్రి వైఎస్ కలని .. దాన్ని నిజం చేస్తానని ప్రకటించారు.
ఆ క్రమంలో షర్మిలకు ఏపీలో పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించాలని కాంగ్రెస్ హైకమాండ్ మొదట భావించినా.. వైసీపీని ఎదుర్కోడానికి ఆమె దీటైన వ్యక్తని భావించి పార్టీ ఏపీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజుతో హడావుడిగా రాజీనామా చేయించి.. 24 గంటల్లోనే షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు అప్పజెప్పింది. షర్మిలకు అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనుక కాంగ్రెస్ హైకమాండ్ చాలా లెక్కలే వేసుకుందంటున్నారు. ఏపీలో వైసీపీ వైపు మళ్లిన కాంగ్రెస్ సంప్రదాయ ఓటుబ్యాంకును తిరిగి దక్కించుకోవడంతో పాటు .. వైఎస్ సెంటిమెంట్ను కాంగ్రెస్ ఓన్ చేసుకునే అవకాశం ఉంది. క్రైస్తవ మత ప్రబోధకుడైన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ప్రభావం ఆ వర్గం ఓట్లపై ఉంటుందనేది మరో అంచనా.. ఆ లెక్కలతోనే జగనన్న బాణాన్ని.. రాజన్న బాణగా మార్చి ప్రయోగించిందంటున్నారు.
మరోవైపు అభ్యర్ధులను సర్వే రిపోర్టుల పేరుతో మార్చేస్తున్న వైసీపీలో సీట్లు గల్లంతైన సిట్టింగులు, ఆశావహులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. వైఎస్ హయాం నుంచి ఆ కుటుంబానికి అండగా నిలిచిన నేతలను కూడా జగన్ నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తున్నారు. అటువంటి వారిలో అత్యధికులకు ఇప్పుడు షర్మిల ఎంట్రీతో కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఈ నెల 4న కాంగ్రెస్లో చేరిన నాటి నుంచి షర్మిల వైసీపికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో టచ్లోకి వెళ్లారంట. ఆ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు కొందరు షర్మిలతో మాట్లాడారంట.
వైసీపీ నుంచి బయటకొచ్చిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాను షర్మిల వెనకే నడుస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడా లిస్ట్లో రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి వంటి ముఖ్యనేతలు ఇంకొందరు కూడా కనిపిస్తున్నారు. కుమారుడి వివాహం హడావుడి పూర్తై .. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టే నాటికి వైసీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు కొందరు కాంగ్రెస్లో చేరేలా షర్మిల గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారంట.
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తూనే త్వరలో జరిగే ఎన్నికల్లో షర్మిల పోటీ చేయనున్నారు. పార్టీ అధిష్ఠానం అసెంబ్లీకే పోటీ చేయాలంటే తన సోదరుడు, ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నుంచే ఆమె బరిలోకి దిగడం ఖాయమంటున్నారు. పార్లమెంటుకు పోటీ చేయాలని ఆదేశిస్తే.. కడప లోక్సభ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడే కడప లోక్సభ స్థానం నుంచి పోటీకి షర్మిల సిద్దమయ్యారన్న ప్రచారం జరిగింది. అయితే జగన్ మాత్రం తన సోదరుడి వరుసయ్యే అవినాష్రెడ్డికి టికెట్ ఇచ్చారు . ఏదేమైనా ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ కడప జిల్లాలో జగన్ పార్టీకి పెద్ద మైనస్సే అంటున్నారు.
Sharmila fights Jagan, Congress AP President, YS Sharmila, YS Jagan, CM Jagan, sister,