గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపికపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టులో వివాదం తేలే వరకు రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయకూడదని నిర్ణయించారు. ఈ రెండు స్థానాలకు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆ ఇద్దరికీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయ్యేందుకు తగిన అర్హతలు లేవని పేర్కొంటూ తమిళిసై తిరస్కరించారు.
తమ అభ్యర్థిత్వాల తిరస్కరణను సవాల్ చేస్తూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ అర్హత అంశం ఈనెల 24న హైకోర్టు తేల్చనుంది. మరో వైపు రెండు ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. గవర్నర్ పేర్కొన్న అర్హతలకు అనుగుణంగా ఇద్దరి పేర్లను కేబినెట్ ద్వారా ప్రతిపాదించాలనే యోచనలో ఉంది.
మరోవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు తమిళిసై బ్రేక్ వేశారు. ఖాళీల భర్తీకి ప్రభుత్వ ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించారు. హైకోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్లో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.