Telangana MLC Candidates : సీఎం రేవంత్ సారధ్యంలోని కాంగ్రెస్ సర్కారు.. రాష్ట్రంలో ఎమ్మెల్సీ స్థానాలపై కసరత్తు పూర్తి చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు అభ్యర్థులుగా మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్ఠానం ఫిక్స్ చేసింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జనవరి 4న నోటిఫికేషన్ జారీ చేయగా.. రెండు ఉప ఎన్నికలు కావటంతో ఎన్నికల సంఘం వేరువేరుగా నోటిఫికేషన్లను ఇచ్చింది. రేపటితో నామినేషన్లకు గడువు ముగియనుంది. అందుకే ఒకరోజు ముందే అభ్యర్ధులను ప్రకటించారు. జనవరి 29న పోలింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు వెల్లడవుతాయి.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల రేసులో తొలుత అద్దంకి దయాకర్ పేరు వినిపించింది. అయితే చివరికి ఆ అవకాశం మహేశ్ కుమార్ గౌడ్ కు దక్కింది. మంగళవారం సాయంత్రమే అభ్యరులను ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెప్పినా.. సీనియర్లు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తడంతో ప్రకటనను ఈరోజుకి వాయిదా వేశారు. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ ఆశించారు. అధినాయకత్వం మందు సామేల్ కు టికెట్ కేటాయించింది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ టిక్కెట్ కూడా దక్కలేదు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనూహ్యంగా ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ అవకాశం దక్కించుకున్నారు. విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న బల్మూరు.. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ, నిరుద్యోగ విద్యార్థుల ఆత్మహత్య.. టెన్త్ పేపర్ లీకేజీల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన ఆయన పోరాటాలు చేశారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఈ పోరాటంలో జైలుకి కూడా వెళ్లారు. జైల్లో ఉన్న సమయంలో స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లి బల్మూరు వెంకట్ ను పరామర్శించారు. అలానే తెలంగాణ ఉద్యమంలో కూడా కీ రోల్ ప్లే చేసి.. ఉద్యమంతో పాటు కష్టకాలంలో పార్టీ కోసం పని చేశారనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇప్పుడు అవకాశం కల్పించారు.
కాగా ఒకే నోటిఫికేషన్ విడుదలైతే… కాంగ్రెస్ కు ఒకటి, బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కేది. కానీ వేర్వేరు ఉప ఎన్నికలు కావడంతో అసెంబ్లీలో సంఖ్యాబలం కారణంగా కాంగ్రెస్ పార్టీకే రెండు సీట్లు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు గవర్నర్ కోటాకు సంబంధించి కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కొడుకు అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేసినట్లుగా సమాచారం.