Rishabh Pant : మొదటి నుంచి బొద్దుగా ఉండే, రిషబ్ పంత్ మరింత బరువు పెరిగాడనే కామెంట్లు నెట్టింట వినిపిస్తున్నాయి. 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలపాలైన తను, నెమ్మదిగా కోలుకున్నాడు. ఇప్పుడు ఎన్సీఏ లో శిక్షణ పొందుతున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. ఎన్సీఏ సిబ్బంది పంత్ కి త్రోలు విసిరి ప్రాక్టీస్ చేయించారు. వీటిని తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.అలా తన ఫిట్ నెస్ రోజురోజుకి మెరుగుపడుతోందని సమాచారం.
కొన్ని వారాలుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఉంటూ పంత్ కసరత్తులు చేస్తున్నాడు. అతనితోపాటు హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ కూడా అక్కడే ఉన్నారు. వీరందరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అయితే మహ్మద్ షమీ మాత్రం ఇంగ్లాండ్ తో రెండు టెస్ట్ ల తర్వాత జట్టులోకి రానున్నాడని అంటున్నారు.
హార్దిక్ పాండ్యా ఎప్పటికి జట్టులోకి వస్తాడనేది తెలీడం లేదు. ఐపీఎల్ లో కూడా ఆడేది అనుమానంగానే ఉంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ప్రకంటించినప్పటికి రోహిత్ శర్మకి కెప్టెన్సీ ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు. బహుశా కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉండే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.
రిషబ్ పంత్ ని ఇప్పటికే ఐపీఎల్ 2024 లో ఢిల్లీ కెప్టెన్ గా ప్రకటించారు. తను ఆడేది కూడా అనుమానంగానే ఉంది. బీసీసీఐ మాత్రం ఐపీఎల్ కన్నా ముఖ్యం టీ 20 ప్రపంచకప్ కాబట్టి, అప్పటికైనా వీరిని సిద్ధం చేయాలనే కృత నిశ్చయంతో ఉన్నట్టు చెబుతున్నారు.
చిన్నస్వామి స్టేడియంలో పంత్ ప్రాక్టీసు ముగించిన కాసేపటికి టీమ్ ఇండియా ప్లేయర్లు విరాట్ కొహ్లీతో పాటు రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్ తదితర ఆటగాళ్లు గ్రౌండ్ కి వచ్చారు. వారితో పంత్ ముచ్చటించాడు. ముఖ్యంగా కొహ్లీ చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. అంతేకాదు ఫిట్ నెస్ సూచనలు కూడా అందించాడు.
పంత్ చివరిసారి 2022లో భారత్ తరఫున బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే సుమారు 13 నెలల నుంచి క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. దీంతో తను కొంత బరువు పెరిగినట్టు సమాచారం. ఒకవేళ ఫిట్ నెస్ ఉన్నా సరే, బరువు తగ్గాల్సి ఉంటుందని అంటున్నారు.అంతేకాదు తను కొట్టే కొన్ని ఫ్రీ షాట్స్, సిక్సర్లు, ఫోర్లుగానీ గతంలో లా అలవోకగా కొట్టలేడని అంటున్నారు. ఎందుకంటే చేతులు, కాళ్లు అన్నీ ఫ్రాక్చర్ కావడంతో మళ్లీ అవి మునుపటి వేగంతో స్వింగ్ అవలేవని అంటున్నారు.
ఇంక వికెట్ కీపింగ్ కూడా ఎక్కువ సేపు చేయలేడని కూడా అంటున్నారు. మరివన్నీ అధిగమించి రిషబ్ పంత్ మళ్లీ టీమ్ ఇండియాలోకి రావాలని, ఎప్పటిలా మ్యాచ్ ఛేంజర్ గా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.