Fog Effect on Flights : దట్టమైన మంచు దుప్పట్లో ఢిల్లీ మునగదీసుకుంది. మరో 2, 3 రోజుల వరకు దేశ రాజధానిలో శీతల వాతావరణం కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) పేర్కొంది. మంచు కారణంగా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(Indira Gandhi International Airport)లో 120 విమానాలు ఆలస్యమయ్యాయి. 53 విమానాలు రద్దయ్యాయి. ప్రతికూల వాతావరణం కారణంగా 21 డొమెస్టిక్ ఎరైవల్స్, 16 డొమెస్టిక్ డిపార్చర్స్, 13 ఇంటర్నేషనల్ ఎరైవల్స్, 3 ఇంటర్నేషనల్ డిపార్చర్స్ రద్దయినట్టు ఎయిర్పోర్ట్ వర్గాలు తెలిపాయి.
ఢిల్లీలో బుధవారం కూడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి. శీతల గాలుల నుంచి ఇప్పట్లో ఉపశమనం లభించకపోవచ్చని ఐఎండీ తెలిపింది. విమానాల ఆలస్యం, రద్దు వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సరైన సమాచారం, వసతులు లేక ఎయిర్పోర్టుల్లో అవస్థల పాలయ్యారు. ఎయిర్లైన్స్, ఎయిర్పోర్టుల మధ్య సమాచార సమన్వయలోపం కారణంగా తాము అవస్థలు పడుతున్నామంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు అతి శీతలంతో గడ్డకట్టుకు పోతున్నాయి. అమెరికాలో మొత్తం 48 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. గత మూడు రోజులుగా మైనస్ ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. మోంటానాలో మైనస్ 60 డిగ్రీల సెల్సియస్, ఇలినాయిస్ మైనస్ 40 డిగ్రీలు, డాలస్లో మైనస్ 9 డిగ్రీలు నమోదయ్యాయి. 9100 విమానాలు రద్దు కావడమో, ఆలస్యం కావడమో జరిగినట్టు ఫ్లైట్ అవేర్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.