ధరణి(Dharani Portal)పై ఏర్పాటైన కమిటీ రెండోసారి భేటీ ముగిసింది. రెండో సారి భేటిలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ భేటీ అయ్యింది. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైనా కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. దానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మళ్లీ భేటీ అయ్యింది.
ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించింది. ఎంతకీ తెగని భూముల పంచాయితీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. ధరణి సాఫ్ట్ వేర్ ఏమిటి? ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు, చేర్పులపైనా కమిటీ సమగ్రంగా రిపోర్ట్ తెప్పించుకొని ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది.
అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని కమిటీ ఆలోచనలో ఉంది. ధరణి కమిటీ కన్వీనర్గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. వీరు ధరణి పోర్టల్ ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి ఇవ్వనుంది.