Sumit Nagal news(Sports news today):
ఆస్ట్రేలియా ఓపెన్ లో 26 ఏళ్ల భారత టెన్నీస్ ఆటగాడు సుమిత్ నగాల్ సంచలనం సృష్టించాడు. 35 ఏళ్ల తర్వాత రెండో రౌండ్ లోకి వెళ్లాడు. అప్పుడెప్పుడో 1989లో భారత ఆటగాడు రమేశ్ కృష్ణన్ , నాటి ప్రపంచ నెంబర్ 1 మ్యాట్స్ విలాండర్ను రెండో రౌండ్లో ఓడించి, షేక్ చేశాడు. ఇప్పుడు కూడా సుమిత్ ప్రపంచ 27 ర్యాంక్ ఆటగాడు కజకిస్థాన్కు చెందిన అలెగ్జాండర్ బబ్లిక్ను వరుస సెట్లలో ఓడించి వెలుగులోకి వచ్చాడు.
తను రెండో రౌండ్ కి చేరగానే సామాజిక మాధ్యమాల్లో 2019లో సుమిత్ ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఇప్పుడు వైరల్ అయ్యింది. అందులో తాను టెన్నీస్ మ్యాచ్ లు ఆడేందుకు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ సహాయంతో ఈ స్థాయికి వచ్చినట్టు తెలిపాడు. 2017 నుంచి నాకు అక్కడి నుంచి సపోర్ట్ అందుతోందని తెలిపాడు.
నిజానికి కోహ్లీ సపోర్ట్ లేకపోతే.. తన కెరీర్ అక్కడే ఆగిపోయేదని, ఈ స్థాయికి వచ్చానంటే, తన చలవేనని విరాట్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సమయంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లేటప్పుడు తన జేబులో కేవలం 6 డాలర్లు మాత్రమే ఉన్నాయని అన్నాడు. అంతా దైవం మీద భారం వేసి ముందడుగు వేశానని తెలిపాడు. ఆ సమయంలో విరాట్ నుంచి ఆర్థికంగా సపోర్ట్ లభించడం వల్లే ఒక స్థాయికి చేరుకున్నానని తెలిపాడు.
ఒకొక్కసారి ఒకొక్క టోర్నమెంట్ కి వెళ్లాలంటే కోటి రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపాడు. అలాంటి సమయంలో స్పాన్సర్లు లేకపోతే, ఆటగాళ్ల కెరీర్ అర్థాంతరంగా ఆగిపోతుందని అన్నాడు. భారతదేశంలో ఎంతోమంది గొప్పగొప్ప ఆటగాళ్లున్నారని తెలిపాడు. వాళ్లకి సరైన ప్రోత్సాహం లేక, మార్గదర్శకత్వం లేక అంధకారంలో మగ్గిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
మ్యాచ్ వివరాల్లోకి వస్తే మెల్బోర్న్ వేదికగా ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో నగాల్.. 6-4, 6-2, 7-6 (7-5)తో బబ్లిక్ ను ఓడించాడు. 35 ఏళ్ల తర్వాత విజయం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. దీంతో తన పేరు మళ్లీ నెట్టింట మార్మోగిపోతోంది. ఈ మ్యాచ్ రెండు గంటల 38 నిమిషాల పాటు సాగింది.
గతంలో రమేశ్ కృష్ణన్ తన కెరీర్లో 1983, 1984, 1987, 1988, 1989 ఐదు సార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్లో మూడో రౌండ్ వరకు వెళ్లడంతో తన పేరు మార్మోగింది. ఇప్పుడు సుమిత్ వంతు వచ్చింది.
తను మొదటి రౌండ్ లో గెలవడం వల్ల రూ.98 లక్షలు గెలుచుకున్నాడు. రెండో రౌండ్ లో చైనాకు చెందిన జున్చెంగ్ షాంగ్తో తలపడతాడు. అక్కడ కూడా గెలిస్తే రూ. 1.40 కోట్ల ప్రైజ్ మనీ గెలుస్తాడు. ఇప్పటికి క్వాలిఫయింగ్ మ్యాచ్ ల్లో గెలవడం ద్వారా రూ.65 లక్షలు సంపాదించాడు.
ఇదంతా కొహ్లీ వల్లే జరిగిందని, నెట్టింట అందరూ కొహ్లీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొహ్లీ కింగ్ మాత్రమే కాదు…మనసున్న మారాజు అని కొనియాడుతున్నారు.