Sheep Distribution Scheme : గొర్రెల పంపిణీ స్కీమ్లో జరిగిన అక్రమాలపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. అవినీతికి పాల్పడిన అధికారులు, ఓఎస్డీలను విచారించేందుకు గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసింది. ఇందుకోసం నిపుణుల సలహాలు తీసుకుంటుంది. గొర్రెల పంపిణీ స్కీమ్లో అక్రమాలు జరిగాయంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో, పశు సంవర్ధక శాఖలో ఫైల్స్ మాయం అయ్యాయని నాంపల్లి పీఎస్లో కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్పై గచ్చిబౌలి, నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 2 కేసుల ఎఫ్ఐఆర్లు ఏసీబీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి.
ఈ అక్రమాల్లో మంత్రి తలసాని ఓఎస్డీగా పనిచేసిన కల్యాణ్, ఇతర అధికారుల ప్రమోయం ఉన్నట్లు పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో డిసెంబర్ 8న మాసబ్ట్యాంక్లోని పశు సంవర్ధక శాఖ ఆఫీస్లోకి ఓఎస్డీ కల్యాణ్ అక్రమంగా చొరబడి.. సిబ్బంది సాయంతో బీరువాలో ఉన్న ఫైళ్లను బయటికి తెచ్చాడు. కొన్ని చించేసి, ముఖ్యమైన ఫైల్స్ను కారులో తీసుకెళ్లాడు. వాచ్మన్ మందాల లక్ష్మయ్య ఫిర్యాదుతో నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఓఎస్డీ కల్యాణ్, కంప్యూటర్ ఆపరేటర్స్ ఎలిజా, మోహన్, అటెండర్ వెంకటేశ్, ప్రశాంత్లను నిందితులుగా చేర్చారు.
ఎఫ్ఐఆర్లో నమోదైన పేర్ల ఆధారంగా అధికారులను మొదట ఏసీబీ విచారించనుంది. తర్వాత వారికి సహకరించిన పెద్దలపై దృష్టి పెట్టనుంది. ఎవరెవరిపై కేసులు నమోదు చేయవచ్చనే దానిపై అధికారులు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలిసింది. గతంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పని చేసిన తలసానితో పాటు.. అప్పటి డైరెక్టర్ లక్ష్మారెడ్డికి నోటీసులు ఇచ్చే విషయంపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదంతా పూర్తయితే గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అక్రమాలు పెద్ద ఎత్తున బయటపడే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతున్నది.