Congress Collapse : మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. హోరాహోరీగా జరిగిన పోరులో హస్తం పార్టీ డిపాజిట్ కూడా కోల్పోయింది. సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం మామూలు విషయం కాదు. బలమైన పాల్వాయి కుటుంబం నుంచి స్రవంతి బరిలో ఉండటం.. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మునుగోడులోనే మకాం వేసి విస్తృత ప్రచారం చేసినా కూడా.. చేతి గుర్తు నామమాత్రపు పోటీకే పరిమితం కావడం దారుణం అంటున్నారు.
సీనియర్ల వెన్నుపోటు.. రేవంత్ రెడ్డిపై కుట్రలే స్రవంతి ఓటమికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కంచుకోట. అలాంటి చోట మూడవ స్థానానికి పడిపోవడంతో పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నారు. ముందుండి గెలిపించాల్సిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ప్రచార సమయంలో ఆస్ట్రేలియా వెళ్లిపోవడం.. కాంగ్రెస్ కార్యకర్తలకు ఫోన్లు చేసి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డికే ఓటు వేయాలని చెప్పడం బాగా డ్యామేజ్ చేసిందని అంటున్నారు. ఇక సీనియర్లంతా మునుగోడులో ముఖం చాటేసి.. పైపైన ప్రచారం చేయడంతో పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం ఆవహించింది. రేవంత్ రెడ్డి ఒక్కరే ఎంత గట్టిగా ఫైట్ చేసినా.. ఆయనకు తీవ్ర స్థాయిలో సహాయ నిరాకరణ ఎదురైంది.
కాంగ్రెస్ వైఫల్యాలతో పాటు టీఆర్ఎస్, బీజేపీల డబ్బు, మద్యం, బలం ముందు హస్తం పార్టీ నిలువలేకపోయిందని అంటున్నారు. బలమైన నాయకుడైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడటంతో మెజార్టీ కార్యకర్తలు ఆయన వెంట వెళ్లిపోవడంతో హస్తం పార్టీ ఓటు బ్యాంకుకు గండిపడింది. మునుగోడు ఉప ఎన్నిక కారు, కమలం మధ్య పోరుగా చిత్రీకరించడంతో.. రేసులో నిలిచినా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యం తగ్గిపోయింది. ఇక పోలింగ్ రోజున పాల్వాయి స్రవంతి సీఎం కేసీఆర్ ను కలిసినట్టు ఉన్న ఫేక్ ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం కూడా మైనస్ అయింది. ఇక ఓటర్లు ఆ రెండు పార్టీల వైపే చీలిపోగా.. కరుడుగట్టిన కాంగ్రెస్ ఓటర్లు మాత్రం హస్తం గుర్తుకు దన్నుగా ఉన్నారు. ఆ సంఖ్య స్వల్పంగా ఉండటంతో.. పాల్వాయి స్రవంతికి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు.