Hyderabad : పచ్చి మాంసం తినొద్దని చెప్పినందుకు.. ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన తుకారాంగేట్ ఠాణా పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ ఆంజనేయులు, మృతుడి బంధువుల తెలిపిన వివరాల ప్రకారం.. తుకారాంగేట్ మరాఠా బస్తీకి చెందిన అజయ్ కాంబ్లే(22) వృత్తిరీత్యా వివాహాది శుభకార్యాలకు బ్యాండ్ కొడతాడు. ఏడాదిన్నర కిందట బంధువుల అమ్మాయి ప్రియాంకను ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. వీరికి 8 నెలల పాప ఉంది.
కొన్నేళ్లుగా మరాఠా బస్తీలో వీరు నివాసమున్న ఇళ్లు శిథిలావస్థకు చేరడంతో అక్కడి నుంచి ఖాళీ చేసి గోల్బావి సమీప బస్తీలో ఏడాదిగా అద్దెకుంటున్నారు. అజయ్ ఇంటి పక్కనే అతని సోదరుడు లకన్ కాంబ్లే, అతని బావ రవి కుటుంబం అక్కడే మూడు ఇళ్లలో అద్దెకుంటున్నారు. ఇళ్ల యాజమాని మహేందర్ ప్రతీనెలా వీరి నుంచి అద్దె వసూలు చేయడానికి శ్రీనివాసాచారి(42)ని పక్కనే మరో ఇంట్లో ఉంచాడు. ఇతడు ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. తరచూ కల్లు తాగడం, ఆ మత్తులో పక్కనున్న ఇళ్లవారితో గొడవలు పడటం చేస్తుండేవాడు.
సంక్రాంతి పండుగ రోజు శ్రీనివాసాచారి తన ఇంట్లో పచ్చి మాంసాని కూరగాయల కత్తితో కోస్తూ తింటున్నాడు. సమీపంలో ఉన్న అజయ్, అతని భార్య ప్రియాంక గమనించి, పచ్చిమాసం ఎందుకు తింటున్నావ్? వండుకొని తినొచ్చు కదా అని అడిగారు. మాటామాటా పెరిగి ఇరువురి మధ్య వివాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీనివాసాచారి పక్కనే ఉన్న కత్తితో ప్రియాంక, అజయ్పై దాడి చేశాడు. ప్రియాంక చేతివేళ్లకు గాయమైంది. అజయ్ పొట్టలో పొడవడంతో తీవ్ర గాయమైంది.
బంధువులు వెంటనే బాధితులను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అజయ్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో ఘటనా స్థలిని మహంకాళి ఏసీపీ రవీందర్, క్లూస్టీం పరిశీలించి పలు ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకొన్నారు. అజయ్ను హత్య చేసిన శ్రీనివాసాచారిని తమకు అప్పగించాలంటూ మరాఠా బస్తీ వాసులు, అజయ్ బంధువులు తుకారాంగేట్ ఠాణాకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. నిందితుడిపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల హామీతో వారంతా అక్కడి నుంచి వెళ్లిపోయారు.