MLA Thopudurthi Prakash Reddy Controversy : అక్కడ అనేక దశాబ్దాల రాజకీయ నేపధ్యం ఉన్న కుటుంబాన్ని ఓడించారు ఆ ఎమ్మెల్యే.. అది కూడా మామూలుగా కాదు మంచి మెజార్టీతో గెలుపొందారు. అయితే విజయం సాధించిన నాటి నుంచి వరుస వివాదాల్లో చిక్కుక్కుకుంటూ.. అసలుకే ఎసరు తెచ్చుకునే స్థితిలో కనిపిస్తున్నారు. ముఖ్యంగా అవినీతి ఆరోపణల నుంచి కిడ్నాప్ ఆరోపణల వరకు ఒకటేంటి రకరకాల ఆరోపణలతో వివాదాస్పదంగా తయారయ్యారు.. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..? ఆయనపై అన్ని ఆరోపణలు ఎందుకు వస్తున్నాయంటారా..?
అనంతపురం జిల్లా రాప్తాడు. పౌరుషాల గడ్డగా పేరున్న ఫ్యాక్షన్ నియోజకవర్గం.. ప్రస్తుతం రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న రాజకీయ వైరం.. సినిమా సీన్లను తలపిస్తోంది. సాధారణంగా సినిమాలో బ్రెక్ ముందు వచ్చే పవర్ సీన్ల తరహాలో ఆ రెండు కుటుంబాల మధ్య డైలాగ్ లు పేలుతున్నాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి కుటుంబాల మధ్య పెద్ద మాటల యద్దమే నడుస్తోంది. సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాప్తాడు దద్దరిల్లుతోంది. వారు పరస్పరం చేసుకుంటున్న ఆరోపణలు, సవాళ్లతో.. అక్కడి రాజకీయాలు హైటెన్షన్కి కారణమవుతూ.. ఎప్పుడేం జరుగుతుందో అనిజనం బిక్కుబిక్కు మంటున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వీరి మధ్య వైరం ఓ రేంజ్లో సాగుతోంది.
ఆ క్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి వ్యవహార శైలి వివాదాస్పదంగా మారుతోంది. అది చాలదన్నట్లు ఆయన సోదరులు వ్యవహరిస్తున్న తీరు, ప్రదర్శిస్తున్న దూకుడు కూడా ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోందంట. ప్రకాశ్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి రాప్తాడులో ఐదుగురు ఎమ్మెల్యేలు అన్న టాక్ మొదలైంది. ఎమ్మెల్యే ఇద్దరు సోదరులతో పాటు, ఆయన వదిన.. ప్రకాష్ రెడ్డి నాన్న ఆత్మరామిరెడ్డి షాడో ఎమ్మెల్యేల్లా వ్యవహరిస్తుండటంతో.. ప్రతిపక్షాలు అయిదుగురు ఎమ్మెల్యేలంటూ ప్రచారం మొదలుపెట్టాయి.
ఎమ్మెల్యే సోదరుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అభ్యంతకర బాషతో స్టేట్మెంట్లు ఇస్తూ కలకలం రేపుతుంటారు. అప్పట్లో ఉరవకొండ పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకెళ్లిన ఆయన.. ఏకంగా స్టేషన్కు తాళాలు వేయడం సంచలనం కలిగించింది. ఆ క్రమంలో తాను చేసే ఇల్లీగల్ పనులు కవర్ చేసుకోవడానికి ఆయన ఎంతవరకైనా వెళ్తారని.. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
సోదరులతో పాటు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి తీరు కూడా వివాదాస్పదం అవుతోంది. అధికారంలోకి వచ్చిన కొత్త నుంచి ఆయనపై ముప్పేట దాడి చేస్తున్నారు ప్రతిపక్ష నాయకులు.. ముఖ్యంగా లోదుస్తుల బ్రాండెడ్ ఇండస్ట్రీ జాకీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయన కమీషన్ డిమాండ్ చేశారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఆ పరిశ్రమ ఏర్పాటు కోసం 20 శాతం కమీషన్ అడిగారని.. దాంతో జాకీ పరిశ్రమ యాజమాన్యం ఆయన డిమాండ్ చేసిన కమీషన్ ఇవ్వకుండా తెలంగాణకు వెళ్ళిపోయిందంట. దాంతో కమీషన్కు కక్కూర్తిపడి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని.. జిల్లా స్థాయిలో ఆరోపణలు, ఆందోళన లు జరిగాయి.. దానిపై ప్రకాశ్రెడ్డి ఎన్నిసార్లు వివరణ ఇచ్చుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది ఆ ఆరోపణలు మాత్రం పోలేదు.
ఇక జాకీ పరిశ్రమ ఎదురుగా ఉన్న భూములలో ఓ పాల డైరీకి సంబంధించి ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశాయి. ఈ విషయం లో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కూడా ప్రకాశ్రెడ్డికి విభేదాలు తలెత్తాయంటారు. అది మాత్రమే కాక టమోటా మండి నిర్వాహకులు నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా పరిటాల వర్గీయులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దాన్ని ఎమ్మెల్యే ఖండిస్తున్నా.. ఆరోపణల తీవ్రత మాత్రం తగ్గడం లేదు.
ఇక ఒక ప్రెస్ మీట్ లో రాప్తాడు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు ఆయన్ని మరో వివాదాంలోకి నెట్టాయి. ఎమ్మెల్యే గా తాను రాప్తాడుకు ఏం చేయలేకపోయానని.. తన మీద తనకే అసంతృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు అధికారపార్టీ శాసనసభ్యుడు.. దానిపై మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరగ్గా., సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి. దాంతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
అలాగే తాజాగా కార్మికులు అక్రమ నిర్బంధ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. రాప్తాడు దగ్గర కొన్ని ప్రాంతాల్లో జగనన్న కాలనీల నిర్మాణం రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డే స్వయంగా చేపట్టారు. దానికి సంబందించి వెస్ట్ బెంగాల్ నుంచి భవన నిర్మాణ కార్మికులను పనికి కుదుర్చుకున్నారు. ఆ భవన నిర్మాణ కార్మికుల ఏజంట్ని కూడా కమీషన్ డిమాండ్ చేశారంట ఆయన. ఆ ఏజంట్ ఎమ్మెల్యే అడిగిన డబ్బులు చెల్లించలేకపోవడంతో.. అతనితో పాటు 9 మంది కార్మికులను పోలీసుతో పాటు, తన అనుచరులను ఉసిగొల్పి అక్రమంగా నిర్బంధించారు. దానిపై ఏకంగా వెస్ట్ బెంగాల్ ఎంపీ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది.
మొత్తమ్మీద పరిటాల ఫ్యామిలీని ఓడించి జెయింట్ కిల్లర్గా పేరు తెచ్చుకున్న తోపుదుర్తి.. ఇప్పుడు వరుస వివాదాలతో.. వైసీపీ అధిష్టానాన్నే ఇరకాటంలోకి నెడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో ఆయన వైఖరిపై రాష్ట్రస్థాయిలో విమర్శలు వస్తుండటం స్థానికి వైసీపీ శ్రేణులకు కూడా మింగుడుపడటం లేదంట.. మరి చూడాలి ఈ ఎమ్మెల్యే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో?
.
.