CM Revanth Reddy Davos Tour : తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సీఎం రేవంత్ రెడ్డి సర్కార్. ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఆకట్టుకునేలా దావోస్లో ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్ ట్యాగ్ లైన్తో ఈ ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా ఈ పెవిలియన్ను రూపొందించారు. తెలంగాణ చారిత్రక సంపదలైన బతుకమ్మ, బోనాలు, చార్మినార్ను అందులో పొందుపరిచారు. మన కళాకారుల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన చేర్యాల పెయింటింగ్, పోచంపల్లి ఇక్కత్, ఐటీ, సాంకేతిక ఆవిష్కరణల కొత్త సౌధం టీ హబ్.. స్కైరూట్ ఏరోస్పేస్.. విభిన్న రంగాల మేళవింపు ఉట్టిపడేలా తయారు చేసిన వాల్ డిజైనింగ్ ఈ పెవిలియన్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ పెవిలియన్తో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను ప్రపంచానికి చాటి చెప్పింది తెలంగాణ. ప్రపంచంలోనే అపారమైన అవకాశాలున్న ప్రాంతంగా తెలంగాణ అని.. పెట్టుబడులకు భారత్లో ఫస్ట్ డెస్టినేషన్ తెలంగాణ అంటూ స్లోగన్స్ను పొందుపరిచారు. మొత్తానికి ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ పేరుతో ముస్తాబు చేసిన ఈ పెవిలియన్ ఇప్పుడు ప్రపంచ దేశాల సంస్థలను ఆకర్షిస్తోంది.
మరోవైపు దావోస్ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతున్నారు. ప్రపంచ ఆర్థికవేదిక సదస్సు అధ్యక్షుడు బ్రెండి బోర్గ్, ఇథియోపియా డిప్యూటీ పీఎం మేకొనెన్తో భేటీ అయ్యారు. తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, నైపుణ్య వృద్ధి వంటి అవకాశాలపై చర్చించారు.