Atal Setu | దేశంలోనే అతి పొడవైన వంతెన ముంబైలో సముద్రం మీదుగా నిర్మించబడింది. దాని పేరే అటల్ సేతు(ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్). ముంబై నుంచి నవీ ముంబై వరకు సముద్రం మీదుగా 21.8 కిలీమీటర్ల పొడువున ఈ బ్రిడ్జి ఉంది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి రాకముందు ముంబై నుంచి నవీ ముంబైకి వెళ్లాలంటే గంటన్నర సమయం పట్టేది. ఇప్పుడు అటల్ సేతు మీదుగా ప్రయాణం చేస్తే కేవలం 20 నిమిషాల్లో గమ్యం చేరుకోవచ్చు. ఈ బ్రిడ్జి పై ఆటోలు, ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదు.
ఇటీవల జనవరి 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అటల్ సేతు వంతెనను ప్రారంభించారు. సముద్రం మధ్యలోకి వంతెనపై నుంచి వెళ్లి అక్కడి అందమైన దృశ్యాలను ఆస్వాదించడానికి ముంబై వాసులు బారులుతీరుతున్నారు. దీంతొ ట్రాఫిక్ పోలీసులకు తలనొప్పి మొదలైంది. వంతెనపై కొన్ని గంటలపాటు కార్లు ఆపి ముంబై వాసులు సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు మొదలవుతున్నాయి.
వంతెన మధ్యలో కొందరు బర్త్ డేలు చేసుకుంటూ రెయిలింగ్పైకి ఎక్కుతున్నారు. ఆ పార్టీలకు సంబంధించిన వీడియోలు ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు వంతెన మధ్యలో ఆపితే ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నా వినకపోవడంతో.. పోలీసులు ఇకపై అలా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజాగా వంతెన మధ్యలో వాహనాలు ఆపిన వారికి రూ.500 చొప్పున ఫైన్ విధించారు. అలా ఒక్క ఆదివారం రోజునే 264 వాహనదారులపై ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. ఆ తరువాత ట్విట్టర్ ద్వారా ముంబై పోలీసులు వాహనదారులకు హెచ్చరించారు. ”అటల్ సేతు బ్రిడ్జి చూడదగ్గ ప్రదేశమే అయినప్పటికీ అది పిక్నిక్ స్పాట్ కాదు. వంతెన మధ్యలో కార్లు ఆపడం, ఫోటోలు తీసుకోవడం వంటివి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం,” అని పోస్టు పెట్టారు.
పోలీసులతో పాటు కొంతమంది నెటిజెన్లు కూడా వంతెన మధ్యలో వాహనాలు ఆపినవారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు.