Berlin Farmers Protest : జర్మనీలో రైతులు, ట్రక్కు డ్రైవర్లు, వ్యవసాయ కూలీలు వేలాదిగా వీధుల్లోకి వచ్చారు. రాజధాని బెర్లిన్ను ట్రాక్టర్లతో ముట్టడించారు. డీజిల్ సబ్సిడీ(Fuel Subsidy) ల్లో కోత విధించాలన్న ప్రభుత్వ యోచనను నిరసిస్తూ సెంట్రల్ బెర్లిన్(Berlin)లో బ్రాండెన్బర్గ్ గేట్(Brandenburg Gate) వద్ద భారీ ప్రదర్శన నిర్వహించారు. 3 వేలకు పైగా ట్రాక్టర్లతో 10 వేల మంది రైతులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. దీంతో బెర్లిన్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. రైతుల ఆందోళనల నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడేందుకు 1300 పోలీసులను రంగంలోకి దింపారు.
వ్యవసాయానికి ఉపయోగించే డీజిల్పై సబ్సిడీతో పాటు ట్రాక్టర్లపై పన్ను మినహాయింపులను రద్దు చేయాలనేది ప్రభుత్వ యోచన. ఇది రైతుల ఆగ్రహానికి కారణమైంది. దీని వల్ల ఒక్కొక్కరిపై రూ.2.5 లక్షలకు పైగా భారం పడుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. ఆ యోచనకు స్వస్తి చెప్పాలంటూ గత వారం రోజులుగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు. హైవేలను ముట్టడిస్తున్నారు. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించి సాధారణ పౌరులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి.
సబ్సిడీలు, పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్లే రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందనేది ప్రబుత్వ వాదిస్తోంది. 2022-23లో వ్యవసాయరంగం ద్వారా 1.26 లక్షల డాలర్ల మేర ఆదాయం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు 45% అధికం. రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వం తన ఆలోచనల నుంచి కాస్త వెనక్కి తగ్గింది. వ్యవసాయ వాహనాలపై పన్ను మినహాయింపులను కొనసాగిస్తామని ఈ నెల 4న ప్రకటించింది. అయితే తమపై భారాలు మోపే అన్ని ఆలోచనలు, నిర్ణయాలను ప్రభుత్వం సంపూర్ణంగా ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
వాస్తవానికి కొన్నేళ్లుగా పశ్చిమ యూరప్ రైతులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పర్యావరణ పరిరక్షణ పేరు చెప్పి.. తమపై ఎనలేని భారాలను మోపుతున్నారంటూ పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. నైట్రోజన్ వాయువుల విడుదలపై 2019లో నెదర్లాండ్స్ కోర్టు ఇచ్చిన రూలింగ్ అక్కడి రైతుల ఆగ్రహావేశాలకు కారణమైంది. వ్యవసాయరంగం వల్లే నైట్రోజన్ కాలుష్యం పెరుగుతోందన్న కారణంగా వ్యవసాయానికి ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. దాంతో రైతులు నిరసన గళమెత్తారు. అదే తరహాలో నిరుడు బెల్జియం, ఐర్లండ్, స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల్లో రైతుల ఆందోళనలు మిన్నంటాయి. తాజాగా రైతుల సెగ జర్మనీని తాకింది.