‘ప్రభుత్వం నన్ను ఎంత అణగదొక్కాలని చూస్తే, ఎంతగా శిక్షించాలని చూస్తే.. అంతగా నాలో పోరాట స్ఫూర్తి పెరుగుతుంది…’ – ఇరాన్లో మానవ హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాడుతున్న నోబెల్ శాంతి (Nobel Prize) బహుమతి విజేత నర్గీస్ మొహమ్మదీ (Narges Mohammadi) మాటలివి. అందుకు తగ్గట్టుగానే ఆమె జైలు శిక్షను మరో 15 నెలలు పొడిగించింది ఇరాన్ రివల్యూనరీ కోర్టు. ఆ శిక్షతో పాటు ఆమెను రెండేళ్లు దేశం నుంచి బహిష్కరిస్తూ తాజాగా తీర్పు చెప్పింది.
వివిధ కేసుల్లో ఆమె 12 ఏళ్లుగా జైలు జీవితంలో మగ్గుతున్నారు. జైలులో ఉన్నప్పుడు ఇస్లామిక్ రిపబ్లిక్కు వ్యతిరేకంగా విషప్రచారం చేశారనేది తాజా అభియోగం. విచారణ సమయంలో ఆమె లేకున్నా.. తీర్పు వెలువరించడం గమనార్హం. 51 ఏళ్ల నర్గీస్ను కోర్టులు దోషిగా నిర్థారించడం 2021 తర్వాత ఇది ఐదోసారి. ఇప్పటివరకు అన్ని కేసుల్లో కలిపి ఆమెకు 31 ఏళ్ల శిక్షకాలాన్ని ఖరారుచేశాయి కోర్టులు.ఇరాన్లో మానవ హక్కుల పరిరక్షణ కోసం నర్గీస్ దశాబ్దాలుగా గళమెత్తుతున్నారు.
తన అవిశ్రాంత పోరాటం కారణంగా గత రెండు దశాబ్దాల్లో జైలుకు వెళ్లడం, బయటకు రావడం పరిపాటిగా మారింది. ఇప్పటివరకు 13 సార్లు అరెస్టయ్యారు. 15 నెలల అదనపు జైలుశిక్షతో పాటు రెండేళ్ల పాటు దేశం నుంచి ఆమెను బహిష్కరించాలని కోర్టు తాజా తీర్పులో పేర్కొంది. నిరుడు నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించినప్పడు నర్గీస్.. టెహ్రాన్లోని ఎవిన్ జైలు నాలుగ్గోడల మధ్య బందీగానే ఉన్నారు.
సంప్రదాయాల ముసుగులో మహిళలపై ఆంక్షలు విధించడమే తెలిసిన ఇరాన్లో అతివల హక్కుల కోసం నర్గీస్ ఎలుగెత్తారు. హక్కుల పోరాటంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా వెనుకంజ వేయలేదు. 1998లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించి తొలిసారి అరెస్టయి ఏడాది జైల్లో ఉన్నారు. హ్యూమన్ రైట్స్ సంస్థలో చేరి మళ్లీ అరెస్టయ్యారు. 2011లో జాతి విద్రోహ కార్యకలాపాలు సాగిస్తున్నారంటూ మరోసారి అరెస్ట్ చేశారు. ఇరాన్లో మరణశిక్షలకు వ్యతిరేకంగా గళమెత్తినందుకు 2015లో జైలుకు పంపారు. ఇలా తన జీవితంలో సగభాగం ఆమె జైల్లోనే గడుపుతున్నారు.
ఇరాన్లోని జంజన్ పట్టణంలో 1972, ఏప్రిల్ 21న ఒక మధ్య తరగతి కుటుంబంలో నర్గీస్ జన్మించారు. ఆమె తండ్రి ఒక రైతు. తల్లి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. 1979లో ఇరాన్ విప్లవం సమయంలో రాచరికం రద్దయింది. అప్పుడే నర్గీస్ తల్లి, సోదరుడు, మరో ఇద్దరు కుటుంబసభ్యులు జైలు పాలయ్యారు.
రాజకీయాలు, వ్యవస్థల జోలికి వెళ్లొద్దని తల్లి హితవు చెప్పినా చెవులకెక్కలేదు. నర్గీస్లోని ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి ఆమెను హక్కుల పోరాటంలో ముందుకు నడిపించాయి. ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత ఆమె కొన్నాళ్లు వార్తాపత్రికలకు కాలమిస్ట్గా చేశారు. కాలేజీలో సహచర విద్యార్థి, ప్రసిద్ధ సామాజిక కార్యకర్త తాఘి రెహమనీను ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కవల పిల్లలు.