టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధబోస్ , జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం తీర్పు ఇచ్చింది. సెక్షన్ 17 ఏ వర్తిస్తుందని అనిరుధ బోస్ తీర్పు ఇచ్చారు. వర్తించదని బేలీ త్రివేది తీర్పు ఇచ్చారు. ఇలా ధర్మాసనంలోని ఇద్దరు జడ్జిలు భిన్నాభిప్రాయాలు వెల్లడించారు. దీంతో ఈ కేసును చీఫ్ జస్టిస్ కు రిఫర్ చేశారు. త్రిసభ్య ధర్మాసానికి ఈ కేసును పంపించారు.
అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఎ కింద గవర్నర్ నుంచి ముందుగా అనుమతి తీసుకోకుండా సీఐడీ తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. ఆయన తరఫున సీనియర్ లాయర్లు సిద్ధార్థ లూథ్రా, హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ వాదించారు. ఈ కేసును జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిల ధర్మాసనం విచారణ చేపట్టింది. గతేడాది అక్టోబర్ 17న తీర్పు వాయిదా వేసింది.
ఈ అంశంతో రెండు కేసుల విచారణ ముడిపడి ఉన్నాయి. అవి ఫైబర్నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ , స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు బెయిల్ ఇస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్. ఈ రెండు కేసులపై ఈ నెల 17, 19 తేదీల్లో విచారణకు రానున్నన్నాయి. అందుకే సుప్రీంకోర్టు వాటికంటే ముందు 17-ఎపై నిర్ణయాన్ని వెలువరించింది.
హైకోర్టులో తాను వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గతేడాది సెప్టెంబర్ 22న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సెప్టెంబర్ 23న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.