Mahabubabad : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చర్ల గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామికి 50 ఏళ్ల చరిత్ర ఉంది. గ్రామానికి తూర్పు వైపున ఉన్న దేవుని గుట్టపై మల్లికార్జున స్వామి వెలసినట్లు అక్కడి గ్రామస్తులు పేర్కొన్నారు. అప్పటి నుండి భక్తులు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మల్లికార్జున స్వామి కళ్యాణం నిర్వహించడం అనవాయితిగా వస్తుంది.
ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి. జాతర జరిగిన మూడు రోజులపాటు అటవీ ప్రాంతం మొత్తం మల్లన్న నామస్మరణతో మారమవుతుంది. ఉత్సవాల్లో భాగంగా మల్లికార్జున స్వామి మేడాలమ్మ, కేతమ్మ కళ్యాణ మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం డోలు వాయిద్యాలు నడుమ బోనాలతో భక్తులు మొక్కులు చెల్లించారు. జాతరకు మాత్రం కనీస సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడూరు మండలం మచ్చర్ల గ్రామం నుండి సుమారు 5 కిలోమీటర్లు లోపలకి వెళ్తే అటవీ ప్రాంతంలో జాతర నిర్వహిస్తూ ఉంటారు. జాతరలో కనీస సౌకర్యాలను కల్పించాలని భక్తులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.