Puri Shankaracharya | అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గర్భగుడితో ప్రవేశించి భగవాన్ శ్రీ రాముడి విగ్రహాన్ని ముట్టుకోవడం సరికాదని పూరి జగన్నాథ మఠ శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.
Puri Shankaracharya | అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గర్భగుడితో ప్రవేశించి భగవాన్ శ్రీ రాముడి విగ్రహాన్ని ముట్టుకోవడం సరికాదని పూరి జగన్నాథ మఠ శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది.
విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో బీజేపీ రాజకీయాలు చేస్తున్నందున్న తాను ఈ కార్యక్రమానికి వెళ్లడం లేదని పూరి శంకరాచార్యులు స్పష్టం చేశారు. శంకరాచారిగా తన పదవికి ఒక గౌరవముందని.. అలాంటిది మోదీ ప్రాణప్రతిష్ఠ పూజలు చేస్తూఆ పవిత్ర విగ్రహాన్ని ముట్టుకుంటే.. అక్కడికి వెళ్లి తాను చప్పట్లు కొడుతూ నిలబడలేనని, ఈ పవిత్ర కార్యాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామి నిశ్చలానంద అంతటితో ఆగలేదు. ప్రధాని మోదీపై మరిన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ”మోదీజీ యోగిగా అవతారం ఎత్తారు. యోగా నేర్పిస్తున్నారు. మతం, ధర్మానికి సంబంధించిన విషయాలలో కలుగజేసుకుంటూనే ఉన్నారు. ఆయన అలా చేస్తూ ఉంటే శంకరాచార్యులుగా ఉన్నవారు.. చప్పట్లు కొడతారా? సాధువులు ప్రణామాలు చేస్తే.. మోదీ తిరిగి కూడా చూడరు.. అందుకే నేను అయోధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వెళ్లకూడదని నిర్ణయించాను. నాకు అయోధ్య అంటే ఎంతో గౌరవముంది. ఆ శ్రీ రాముడు నా హృదయంలో ఉన్నాడు. కానీ ఈ సందర్భంలో నేను అయోధ్యకు వెళ్లడం మంచిదికాదు,” అని అన్నారు.
భగవాన్ శ్రీ రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని శాస్త్రాల్లోని నిబంధనల ప్రకారం చేయాలని.. అలా చేయకపోతే విగ్రహంలోని దివ్య తేజస్సు తగ్గిపోయి.. క్షుద్ర శక్తులు ఆ ప్రదేశంలోకి ప్రవేశిస్తాయని స్వామి నిశ్చలానంద హెచ్చరించారు.
అయోధ్యలో జనవరి 22న జరిగే శ్రీ రామ విగ్రహ ప్రాణప్రతిష్టకు నలుగురు శంకరాచార్యులలో ఇద్దరు హాజరుకావడం లేదు. ఇప్పుడు తాజాగా పూరి శంకరాచార్యుల వివాదాస్పద వ్యాఖ్యలు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కాంగ్రెస్ చేతికి ఆయుధంలా మారాయి.
నలుగురు శంకరాచార్యులలో ఒడిశా రాష్ట్రంలోని పూరి మఠం గోవర్ధన పీఠం శంకరాచార్యులు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలి పీఠం శంకరాచార్యులు రామమందిర కార్యక్రమానికి హాజరు కావడం లేదని ప్రకటించారు. మరోవైపు కర్ణాటక శ్రింగేరి పీఠం, గుజరాత్ ద్వారకలోని శారదా పీఠం శంకరాచార్యులు ఇంతవరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు.