Rohit Sharma : టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి రికార్డుతో పాటు ఒక చెత్త రికార్డ్ కూడా తెచ్చుకున్నాడు. ఇండోర్ వేదికగా ఆదివారం జరిగిన రెండో టీ 20 లో రోహిత్ శర్మ అందరికన్నా అత్యధికంగా 150 టీ 20లు ఆడిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ 134 మ్యాచ్లతో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2007లో రోహిత్ శర్మ భారత్ తరపున టీ 20లో అరంగేట్రం చేశాడు. కాకపోతే అత్యధికంగా మ్యాచ్ లు ఆడి రికార్డ్ స్రష్టించిన రోహిత్ శర్మ, అయితే రెండో టీ20లో కూడా డకౌట్ అయి ఓ చెత్త రికార్డు నమోదు చేశాడు. మెన్స్ టీ20ల్లో అత్యధికసార్లు డకౌట్గా వెనుదిరిగిన రెండో బ్యాటర్గా రోహిత్ నిలిచాడు. మొదటి స్థానంలో ఐర్లాండ్ ప్లేయర్ పాల్ స్టిర్లింగ్ 13 డక్ అవుట్స్ తో ముందున్నాడు. విచిత్రం ఏమిటంటే వీరిద్దరే ఎక్కువ టీ 20 మ్యాచ్ లు ఆడిన వారిలో మొదటి రెండు వరుసల్లో ఉన్నారు.
మూడు టీ20ల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా 2-0 తో సిరీస్ గెలిచింది. ఈ మ్యాచ్ అనంతరం స్పందించిన రోహిత్ శర్మ, జట్టులోని ప్రతీ ఒక్కరు బాగా ఆడుతున్నారని తెలిపాడు. అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు ఎవరికి వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని తెలిపాడు.
టీ20ల్లో 150 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటం గొప్పగా ఉందని రోహిత్ శర్మ అన్నాడు. 2007లో సుదీర్ఘ ప్రయాణం మొదలైందని అన్నాడు. ఈ ఫార్మాట్లో గడిపిన ప్రతీ క్షణాన్ని ఆస్వాదించానని తెలిపాడు. అయితే రికార్డులనేవి వస్తుంటాయి, పోతుంటాయి, కానీ దేశానికేం చేశామన్నదే ప్రధానమని తెలిపాడు.
మనవల్ల భారతదేశానికి, క్రికెట్ కి పేరు వస్తే అంతకన్నా మించిన ఆనందం మరొకటి ఉండదని తెలిపాడు. రోహిత్ శర్మ బాగా ఆడితే…భారతదేశం గెలిచింది అంటారు. అదే నిజమైన బహుమానం అని అన్నాడు.