Jallikattu : ఎన్నో ఏళ్లుగా తమిళనాడులో జరుగుతున్న సంప్రదాయ క్రీడ అయిన జల్లికట్టు పోటీలు మధురైలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున యువకులు ఈ పోటీలో పాల్గొని ఎద్దులను పట్టుకునేందుకు పరుగులు తీస్తున్నారు. పలుచోట్ల జరిగే జల్లికట్టు పోటీల కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అవన్యాపురంలో జరగుతున్న ఈ పోటీల్లో వెయ్యి ఎద్దులు పట్టుకునేందుకు 600ల మంది యువకులు పరగులు తీస్తున్నారు. ఎద్దులను పట్టుకునే సమయంలో తీవ్రంగా గాయపడ్డ వారి కోసం ముందుగానే 10 వైద్య బృందాలను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే పోటీల సందర్భంగా ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు.
ప్రతి ఏటా జనవరి రెండో వారంలో పొంగల్ పంట పండుగ సందర్భంగా ఈ జల్లికట్టు పోటీలను మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ఇరుతఘువుతాల్ అని తమిళంలో పిలిచే ఈ జల్లికట్టు పోటీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు.
ఈ పోటీల్లో తీవ్రగాయాలవుతాయని తెలిసి కూడా హుషారుగా యువత ఎద్దులను పట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తూ వాటి వెంట పరుగులు తీస్తారు. ఎద్దు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాని వెంట అంతే వేగంగా పరుగు తీసి ఎద్దు వెనుక భాగంలో ఉన్న మూపురాన్ని రెండు చేతులతో పట్టుకుని ఎద్దును ఆపడానికి ప్రయత్నిస్తారు. ఈ సందర్భంగా అనేక మంది గాయాలపాలవుతారు.