HUSNABAD : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సంక్రాంతి పండగ పూట విషాదం నెలకొంది. అతివేగంతో కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటన హుస్నాబాద్- కరీంనగర్ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.
కారులో ప్రయాణిస్తున్న అజయ్, అఖిల్, వెంకటేష్ అనే ముగ్గురు మైనర్లకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సును తప్పించబోయి కారు బోల్తా పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.