Zambia : కలరా వ్యాధితో జాంబియా బెంబేలెత్తిపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా విజృంభించింది. ఇప్పటివరకు 351 మంది చనిపోగా.. 9 వేలు కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా దేశమైన జాంబియాను ముంచెత్తుతున్న వర్షాల కారణంగా.. అధిక జనాభా, పేదరికంతో మగ్గిపోతున్న పట్టణ ప్రాంతాల్లో కలుషిత నీటినే తాగుతుండటం పరిస్థితిని మరింత దుర్భరం చేస్తోంది.
కలుషిత నీటిని సేవించడం వల్ల గత 4 నెలల్లోనే 7004 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటివరకు పది ప్రావిన్సుల్లోని 45 జిల్లాలకు కలరా పాకింది. దీనిని అడ్డుకోవడంలో హెల్త్ వర్కర్లు సతమతవుతున్నారు. తొలిసారిగా 1977లో ఇక్కడ కలరా వ్యాపించింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సాయం కోసం జాంబియా ప్రభుత్వం అర్థించింది.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలల రీఓపెనింగ్ను వాయిదా వేసింది. ఈ వ్యాధి మరింత ప్రబలకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 లక్షల వ్యాక్సిన్లను పంపుతోంది. లక్ష్యం అనేది లేకుండా గ్రామీణులు పట్టణాలకు వలస వస్తుండటాన్ని అధ్యక్షుడు హకైండే హిచిలేమా ఆక్షేపించారు. అదే కలరా వ్యాధి వ్యాప్తికి కారణమన్నారు.
పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే మంచినీరు, భూమి అందుబాటులో ఉంటుందని.. గ్రామాలకు తిరిగి వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. కలరా తమ దేశాలకు వ్యాపించకుండా పొరుగునే ఉన్న మొజాంబిక్, జింబాబ్వే దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.