Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభమయ్యింది. ఈ యాత్రను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రారంభించారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వై ఎస్ షర్మిళ హాజరయ్యారు.
ప్రారంభ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. “మణిపూర్లో లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. మణిపూర్లో మౌలిక సౌకర్యాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రధాని ఇప్పటివరకు మణిపూర్లో పర్యటించలేదు. మణిపూర్ ప్రజల బాధలు తెలుసుకునేందుకు ప్రధాని రాలేదు. గతంలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చేపట్టా. భారత్ జోడో యాత్రలో దేశ ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్నా” అని రాహుల్ గాంధీ ప్రసంగించారు.
గతేడాది జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్ పాదయాత్ర చేశారు. న్యాయ్ యాత్ర మాత్రం తూర్పు నుంచి పశ్చిమం వైపు సాగుతుంది. జోడోయాత్ర పూర్తిగా పాదయాత్రగా సాగింది. న్యాయ్ యాత్ర మాత్రం కాస్త భిన్నంగా జరగనుంది. కొంత పాదయాత్రగా, కొంత బస్సు యాత్రగా సాగనుంది. 15 రాష్ట్రాల్లోని 100 లోక్సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ రాహుల్ యాత్ర కొనసాగించనున్నారు. మణిపూర్ లో మొదలైన ఈ యాత్ర మార్చి 21న ముంబైలో ముగుస్తుంది.
67 రోజులు.. 6700 కిలోమీటర్లు..
ఈ యాత్రలో రాహుల్ 6,713 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు. 110 జిల్లాలు, 100 లోక్ సభ స్థానాలు, 337 అసెంబ్లీ సెగ్మెంట్లను 67 రోజుల్లో పూర్తి చేయనున్నారు. జోడో యాత్ర సుధీర్గంగా సాగింది. కానీ.. న్యాయ్ యాత్రకు కాంగ్రెస్ అంత సమయం కేటాయించడం లేదు. లోక్సభ ఎన్నికలు 3 నెలలే సమయం ఉండటంతో 67 రోజుల్లో యాత్ర పూర్తి చేసేలా ప్లాన్ చేశారు.
జోడో యాత్రతో పార్టీ బలపడిందని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ ప్రభావంతోనే కర్నాటక, తెలంగాణలో అధికారంలోకి వచ్చామని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఈ న్యాయ్ యాత్రతో ప్రజల్లోకి వెళ్తామని.. లోక్సభ ఎన్నికల్లో కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నిరుద్యోగం, ధరలు పెరుగుదల , సామాన్యులకు న్యాయం, సామాజిక న్యాయం అనే అంశాల చుటూ రాహుల్ ప్రసంగాలు ఉండనున్నాయి. దేశంలో అందరికీ న్యాయం జరగడంలేదని రాహుల్ ఆరోపిస్తున్నారు. అందరికీ న్యాయం చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ చెబుతోంది. ప్రశ్నించే గొంతులు దేశంలో తగ్గిపోయాయని.. బీజేపీ పాలనలో ప్రశ్నించే పరిస్థితి లేదని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి అణచి వేస్తున్నారని మండిపడుతోంది.
పార్లమెంట్ భవనంలో దాడి జరిగితే ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కనీసం జవాబుదారీతనం లేకుండా పోయిందని ప్రశ్నించి విపక్ష ఎంపీలను సస్సెండ్ చేశారని ధ్వజమెత్తుతున్నారు. ఈ అంశాల చుట్టూనే న్యాయ్ యాత్రలో రాహుల్ ప్రసంగాలు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.