New Virus : చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని ఏ స్థాయిలో గడగడలాడించిందో అప్పుడే మరచిపోలేం. ఎన్నో కుటుంబాలు కరోనా కారణంగా.. చిన్నాభిన్నమయ్యాయి. కుటుంబ యజమానుల్ని కోల్పోయి.. దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. తాజాగా..
గబ్బిలాల నుంచి మనుషులకే సోకే ప్రమాదం ఉన్న మరో కొత్తవైరస్ ను థాయ్ లాండ్ లో గుర్తించినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకో హెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపిందది. ఈ వైరస్ ను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సమావేశంలో సైంటిస్ట్ డాక్టర్ పీటర్ దస్జాక్ వెల్లడించారు. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో గతంలో పరిశోధనలు జరిపిన ఈ ఎకో హెల్త్ పై గతంలో అనేక వివాదాలు చుట్టుముట్టాయి. ఈ ల్యాబ్ నుంచే కరోనా లీకైందని వచ్చిన అనుమానాలను ఎకోహెల్త్ కొట్టిపారేసింది.
తాజాగా గుర్తించిన వైరస్ కు కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం ఉందని గుర్తించినట్లు పీటర్ తెలిపారు. థాయ్ లాండ్ లో ఓ గుహలోని గబ్బిలాల్లో ఈ వైరస్ ను గుర్తించినట్లు వెల్లడించారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంటపొలాల్లో ఉపయోగిస్తున్నారని, ఆ ఎరువులోనే వైరస్ ను గుర్తించినట్లు స్పష్టం చేశారు. మనుషులతో తరచూ కాంటాక్ట్ లోకి వస్తున్న ఈ వైరస్.. భవిష్యత్ లో అత్యవసర పరిస్థితుల్ని తీసుకొచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా.. గతేడాది డిసెంబర్ లో ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. డిసెంబర్ నెలలో 10 వేలమంది కరోనాతో మరణించినట్లు WHO తెలిపింది. జేఎన్ 1 వేరియంట్ వ్యాప్తి సమయంలోనే పండుగల సెలవులు రావడం, అందరూ ఒకచోటికి చేరడం కూడా కేసుల పెరుగుదలకు కారణమని వివరించింది.