Rameshwaram Cafe : ఏదో సాధించాలన్న తపన కొందరిని వెన్నాడుతూనే ఉంటుంది. సొంత లక్ష్యాల కోసం ఇతరులకు భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఆ క్రమంలో జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా అలవోకగా అధిగమించడం వారి నైజం. మరెవరూ అలా చేయలేరు కాబట్టి విజయాలను పాదాక్రాంతం చేసుకోగలుగుతారు కూడా. అలాంటి వ్యక్తుల్లో దివ్యారావు ఒకరు.
పుట్టింది దిగువ మధ్యతరగతి కుటుంబంలో. అరకొర ఆర్థిక పరిస్థితుల నడుమ 21 ఏళ్లకే సీఏ పూర్తి చేసింది. ఆపై అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ ఫైనాన్స్ పట్టా పుచ్చుకుంది. కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా డబ్బును పొదుపుగా వాడటం చిన్నతనం నుంచే అలవడింది. అహ్మదాబాద్లో చదువుతున్న సమయంలో ఓ సారి ఎగ్ పఫ్ తినాలనే కోర్కె కలిగింది. దాని కోసం వారం రోజులు ఎదురుచూసిన సందర్భాలూ ఉన్నాయని దివ్య గుర్తు చేసుకుంది.
పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. పైగా తల్లిదండ్రులను చూసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో విచ్చలవిడిగా ఖర్చు చేయడం ఆమెకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. దివ్య కుటుంబంలో సీఏ పూర్తి చేసిన తొలి వ్యక్తి ఆమే. అదీ అతి కష్టం మీద చదవగలిగింది. 2, 3 బస్సులు మారి మరీ ట్యూషన్కు వెళ్లేది. ఐఐఎం చేస్తున్న సమయంలోనే ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన అంకురించింది.
మెక్ డొనాల్డ్స్, కేఎఫ్సీ, స్టార్బక్స్ వంటి ఫుడ్ చెయిన్ సంస్థలు ఎలా విజయవంతం అయ్యాయన్నదీ ఎంబీఏ కోర్సులో కేస్ స్టడీస్గా ఉండేవి. వాటి నుంచే దివ్య ప్రేరణ పొందింది. ఫుడ్ చెయిన్స్ను భారతీయులు సక్సెస్ఫుల్గా నడపలేరంటూ ఓ ప్రొఫెసర్ చెప్పిన మాటలు ఆమెలో పట్టుదలను పెంచాయి. సంప్రదాయ దక్షిణాది వంటకాలను ప్రపంచమంతటికీ విస్తరింపచేయాలని అప్పుడే ఓ దృఢ నిశ్చయానికి వచ్చింది.
అయితే రాఘవేంద్రరావు పరిచయం అయ్యేంత వరకు తన ఆలోచనలకు కార్యరూపం ఇవ్వలేకపోయింది దివ్య. రాఘవ్కి అప్పటికే ఫుడ్ ఇండస్ట్రీలో 15 ఏళ్ల అనుభవం ఉంది. కుటుంబం నుంచి ఎలాంటి ఆసరా లేకపోవడంతో జీవితంలో ఎంతో కష్టపడ్డాడు. పలు రెస్టారెంట్లలో క్లీనర్, కౌంటర్ బోయ్, క్యాషియర్, మేనేజర్ వంటి ఉద్యోగాలెన్నో చేశాడు. ఒక్కోసారి రెస్టారెంట్లో కూరగాయలు కూడా తరగాల్సి వచ్చేది.
చివరకు బెంగళూరులోని శేషాద్రిపురంలో రోడ్డు పక్కన చిన్న రెస్టారెంట్ పెట్టుకున్నాడు. చార్టెర్డ్ అకౌంటెంట్గా రాఘవ్ని కలిసినప్పుడు వ్యాపారంలో ఫైనాన్సింగ్ వ్యవహారాలు ఎలా చక్క బెట్టుకోవాలన్నదీ సలహా ఇచ్చానని దివ్య గుర్తు చేసుకుంది. అయినా రాఘవ్కి కలిసిరాలేదు. ఆ బిజినెస్ మూతపడింది. ఇద్దరం కలిసి రెస్టారెంట్ చెయిన్ స్టార్ట్ చేద్దామంటూ రాఘవ్ను ఆమె ఆహ్వానించింది. ఆ నిర్ణయాన్ని దివ్య కుటుంబసభ్యులు వ్యతిరేకించారు. సీఏ చదివి.. ఇడ్లీ, దోశెలు అమ్ముకోవడమేమిటని తిట్టిపోశారు.
వాటిని పట్టించుకోకుండా దివ్య ముందుకే సాగింది. అప్పటి దాకా చేసిన చిన్నపాటి ఉద్యోగంతో కూడబెట్టిన సొమ్ముతో 2021లో రెస్టారెంట్ను ప్రారంభించింది. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు నివాళిగా రామేశ్వరం కేఫ్ అని దానికి పేరు పెట్టారు. కలాం పుట్టింది రామేశ్వరంలో కాబట్టి ఆ పేరు ఎంచుకున్నారు. ఫుడ్ క్వాలిటీ విషయంలో దివ్య, రాఘవ ఎన్నడూ రాజీపడలేదు. కొద్ది కాలంలోనే వారి కేఫ్కు ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది.
ప్రస్తుతం బెంగళూరులో రామేశ్వరం కేఫ్ అవుట్ లెట్లు నాలుగున్నాయి. ఈ రెస్టారెంట్ చెయిన్ హైదరాబాద్లోని మాదాపూర్కు విస్తరించింది. దుబాయ్, చైన్నైల్లోనూ కేఫ్లు ఆరంభం కానున్నాయి. ప్రతి నెలా రూ.4.5 కోట్ల ఆదాయం లభిస్తోంది. రానున్న ఐదేళ్లలో భారతదేశమంతటా రామేశ్వరం కేఫ్లను విస్తరింపచేయాలనేది దివ్య-రాఘవేంద్రరావు జంట లక్ష్యం.