Political Heat Rises In Penamaluru : కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం వైసీపీలో అసంతృప్తి అగ్గి రాజుకుంటోంది. పెనమలూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంత్రి జోగి రమేశ్ను నియమించడాన్ని నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని వీడేందుకు సిద్దమయ్యారు. ఇక పెనమలూరు టికెట్ ఆశిస్తున్న పడమటి సురేశ్ బాబు, తుమ్మల బుజ్జి వర్గాలు ఆందోళనలకు దిగుతుండటం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయంటున్నారు. మరోవైపు పార్థసారథి టీడీపీలో చేరతారన్న ప్రచారం ఆ పార్టీలో కూడా కలకలం రేపుతోంది.
కృష్ణా జిల్లా పెనమలూరుకు మాజీ మంత్రి, సీనియర్ నేత పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని కాదని మంత్రి జోగు రమేష్ను వైసీపీ పెనమలూరు ఇన్చార్జ్గా ప్రకటించడంతో పార్థసారథి పార్టీని వీడేందుకు సిద్దమయ్యారు. సీఎం జగన్ను కలిసిన ఆయనకు.. పెనమలూరు కాకుండా గన్నవరం టికెట్ ఇస్తామని ప్రతిపాదన చేశారని తెలిసింది. అక్కడి నుంచి పోటీ చేసేందుకు పార్థసారథి సుముఖంగా లేరు. పెనమలూరు నియోజకవర్గంతో తనకు 25 ఏళ్ల అనుబంధం ఉందని చెబుతున్నారు. ఆ క్రమంలో పార్థసార్థి తెలుగుదేశం పార్టీలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
పక్కపార్టీ వాళ్లని తిట్టలేదనే కారణంతోనే తరకు టికెట్ నిరాకరించారంటున్నారు పార్థసారథి . తాజాగా ఇదే విషయంలో వైసీపీని, జగన్ని ఆయన టార్గెట్ చేశారు. ప్రతిపక్షాలపై దౌర్జన్యాలు చేయకపోవడం, అసభ్య పదజాలం వాడకపోవడమే తన అసమర్థత అన్నారు. అందుకే తనకు వైసీపీలో టికెట్ దక్కలేదన్నారు. పార్టీ కచ్చితంగా ఓడిపోతుందనుకున్న గన్నవరం సీటు తనకు ఇవ్వాలనుకున్నారని, కానీ తాను వద్దనడం వల్లే అసలు టికెట్ లేకుండా చేశారన్నారు. వైసీపీలో బీసీలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. ఆ క్రమంలో ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడే మంత్రి జోగి రమేష్ కి పెనమలూరు టికెట్ దక్కడంతో పార్థసారథి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
పెనమలూరుకు జోగు రమేష్ను వైసీపీ ఇన్చార్జ్గా ప్రకటించడంతో కృష్ణా జిల్లా కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఛైర్పర్సన్ పడమటి స్నిగ్ధ తన పదవికి రాజీనామా చేశారు. డీసీఎంఎస్ కార్యాలయానికి తన రాజీనామా పంపినట్టు ఆమె వర్గం నాయకులు వెల్లడించారు. జోగి రమేశ్ను పెనమలూరు ఇన్ఛార్జిగా నియమించడంపై వైసీపీ అధిష్ఠానం పునరాలోచించాలని.. ఆరంభం నుంచి పెనమలూరులో పార్టీ జెండాను మోసిన కంకిపాడు మండలం పొద్దుటూరుకు చెందిన తన తండ్రి పడమటి సురేష్బాబుకు లేదా తనకు పెనమలూరు టిక్కెట్టు కేటాయించాలంటూ స్నిగ్ధ కోరుతున్నారు.
జోగి రమేశ్కు సహకరించేది లేదని తేల్చి చెప్తున్నారు పడమటి సురేశ్ బాబు.. మరోవైపు పెనమలూరు వైసీపీ టికెట్ ఆశిస్తున్న కమ్మ కార్పొరేషన్ చైర్మన్ తుమ్మల బుజ్జి వర్గం ఆందోళనలు మొదలుపెట్టింది. బుజ్జికి టికెట్ కేటాయించాలంటూ ఆయన వర్గీయులు ఇప్పటికే నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీలో పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొనడం గమనార్హం. పక్క నియోజకవర్గాల నేతలు మాకొద్దంటూ జోగి రమేష్కు వ్యతిరేకంగా కంకిపాడు బస్టాండు ఎదుట పార్టీ కేడర్ రాస్తారోకో నిర్వహించింది.
వైసీపీలో రచ్చ అలా ఉంటే.. టీడీపీలో సైతం ఆందోళనలు మొదలయ్యాయి. గత ఎన్నికల్లో పార్థసారథి చేతిలో పరాజయం పాలైన మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం తమ నేతకే టికెట్ ఇవ్వాలని ఆందోళను షురూ చేసింది. పార్థసారథి టీడీపీలో చేరడం ఖాయమవ్వడం. ఆయనకే పెనమలూరు టీడీపీ టికెట్ ఇస్తారన్న ప్రచారంతో .. బోడే ప్రసాద్ వర్గంలో కలవరం మొదలైంది. ఇంతకాలం టీడీపీ కోసం పోరాడిన వ్యక్తిని పక్కన పెట్టి ప్రత్యర్థికి టికెట్ ఇస్తారేమో అన్న ఆందోళన వారిలో కనిపిస్తోంది.
టీడీపీలో టికెట్ ఖాయం అని తానే ఎమ్మెల్యే అవుతానని ఆశగా ఎదురుచూస్తున్న బోడె ప్రసాద్ కి పార్ధసారధి రూపంలో షాక్ తగిలిందంటున్నారు. ఆయనకు నచ్చ చెప్పడానికి టీడీపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందంట. టీడీపీ సీనియర్ నేత గద్దె రామమోహన్ వెళ్లి బోడె ప్రసాద్కు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. అయితే ఎవరు ఏమి చెప్పినా వెనక్కు తగ్గేది లేదని బోడె ప్రసాద్ వర్గం అంటోంది. అదలా ఉంటే పార్థసారథికి టికెట్పై చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేదని బోడే ప్రసాద్ తన వర్గీయులతో అంటున్నారంట. పార్టీలో చేరితే చేరవచ్చు కానీ టికెట్ ఇవ్వకూడదన్నది బోడె వర్గం మాటగా ఉంది.
ఒకవేళ పార్ధసారధికే కనుక టికెట్ ఇస్తే మాత్రం పెనమలూరు టీడీపీలో చిచ్చు రగలడం ఖాయంగా కనిపిస్తోంది. అదే జరిగితే బోడె వర్గం కూడా సీరియస్ గానే డెసిషన్ తీసుకుంటుందని అంటున్నారు. బోడె ప్రసాద్ 2014లో పెనమలూరు నియోజకవర్గం నుంచి 30 వేల పైచిలుకు ఓట్లతో మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2019లో తిరిగి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి చేతిలో 11 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ బలోపేతానికి గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెనమలూరు పంచాయతీని టీడీపీ అధిష్టానం ఎలా సెట్రైట్ చేస్తుందో చూడాలి.
.
.