Sankranti Celebrations : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే సంక్రాంతి వేడుకల నేపధ్యంలో గ్రామాలన్నీ పండుగ సందడితో కళకళలాడుతున్నాయి. పల్లె, పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి మంటలు మండుతున్నాయి. భోగి మంటలు ఆడుతూ చిన్నాపెద్దా సంబరాలు జరుపుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన చుట్టాలతో తెలుగు లోగిళ్లలో సంతోషకర వాతావరణం కనిపిస్తోంది. అందరూ కలిసి ఆప్యాయంగా పలకరించుకుంటూ పండగ చేసుకుంటున్నారు.
హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో పట్టణ, పల్లె ప్రాంతాల్లో సంక్రాంతి శోభతో ఉట్టిపడుతున్నాయి. ఈ పండుగలో మొదటి రోజు నిర్వహించే భోగి ప్రత్యేకతను సంతరించుకుంటుంది. పల్లె, పట్టణాల్లో ప్రజలు వేకువజామున లేచి భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ ప్రజలు ఆటపాటలతో సందడి చేశారు. ముఖ్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. ఇక పిల్లలు గాలి పటాలు ఎగరేస్తూ సందడి చేస్తున్నారు.
కాగా ఈ ఏడాది ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి భోగి వేడుకలు జరపడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అమరావతిలోని మందడంలో టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ మేరకు భోగి సంబరాల్లో చంద్రబాబు, పవన్ పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాల ఉత్తర్వులను భోగి మంటల్లో వేసి.. చంద్రబాబు, పవన్ నిరసన తెలిపారు. వీరిద్దరి రాకతో మందడంలో సంక్రాంతి సెలబ్రేషన్స్ మరింత ఘనంగా జరుపుకుంటున్నామని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నారా, నందమూరి కుటుంబాలు.. సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం నారావారిపల్లెకి చేరుకున్నాయి. తెల్లవారుజామునే వారంతా భోగి మంటలు వేసి సందడి చేశారు.
తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ లో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంచు మోహన్ బాబు విష్ణు పాల్గొన్నారు. అలానే సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు భోగి వేడుకల్లో పాల్గొన్నారు. అంబటి రాంబాబు కోసం ప్రత్యేక గీతం ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఇప్పుడు కూడా తన స్టెప్పులతొ అంబటి రాంబాబు అదరగొట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. మరోవైపు నగరిలోని తన నివాసం వద్ద మంత్రి రోజా భోగి సంబరాల్లో పాల్గొన్నారు. భర్త సెల్వమణితో కలిసి భోగి మంటలు వేశారు.
మరోవైపు గోదావరి జిల్లాల్లో సంక్రాంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. గోదావరి జిల్లాల్లో సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కోళ్ల పందాలు. అందుకే.. కత్తులు దూసేందుకు కోళ్లు సిద్దమవుతున్నాయి. యుద్ద క్షేత్రాలుగా పందాల బరులు రెడీ అవుతున్నాయి. మూడు రోజులు పాటు జరగబోయే ఈ పందాలపై పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతాయి. దీని కోసం పందెం రాయుళ్లు సర్వం సిద్ధం చేశారు. డే అండ్ నైట్ సాగేవిధంగా ప్రత్యేక ఫ్లడ్ లైట్లు కూడా సిద్ధం చేశారు.
ఈ మూడు రోజుల పాటు.. రేయింబవళ్లు.. 24 గంటలు నిర్విరామంగా పందాలు జరుగుతాయి. పిల్లలు, పెద్దోల్లు అనే తేడా లేకుండా అందరూ బరుల చుట్టూ చేరుతారు. పోలీసులు హెచ్చరికలు జారీ చేసినా… పందెం రాయుళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని ఎలా వదులుకుంటామని చెబుతున్నారు. ఇక్కడ ఈ పందాలపై కోట్లలో బెట్టింగ్స్ కాస్తారని సమాచారం అందుతుంది.