Vande Mataram : జాతీయ గీతం జనగణమనకు,వందేమాతరం గేయానికి సమాన హోదా ఉందని కేంద్రం స్పష్ట చేసింది. జాతీయ గీతం జనగణమనకి సమానమైన హోదాను వందేమాతరం గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై కేంద్రం ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది.
జనగణమనకి, వందేమాతరానికి సమాన గౌరవం,హోదా కల్పించేలా మార్గదర్శకాలను రూపొందించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. భారత స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని పిటిషనర్, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని కోరారు. విద్యాసంస్థల్లో రోజూ వందేమాతరం, జనగణమన పాడేలా తగిన ఉత్తర్వులు ఇవ్వాలని అశ్విని ఉపాధ్యాయ విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంపై సమాధానం చెప్పాలని కేంద్ర హోమ్, విద్యా, సాంస్కృతిక, న్యాయ మంత్రిత్వ శాఖలకు డిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ నోటీసులపై స్పందించిన కేంద్రం జనగణమన, వందేమాతరం గేయానికి సమాన హోదా ఉంటుందని స్పష్టం చేసింది.