Street Dogs Attack on Buffalo : కరీంనగర్ జిల్లాలో వీధి కుక్కల సంచారం రోజురోజుకు పెరుగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా గ్రామంలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లలతో పాటు.. పెద్దలు సైతం రోడ్లపై ఒంటరిగా వెళ్లాలంటే జంకుతున్నారు. ఒంటరిగా వెళ్లే వ్యక్తులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. గడిచిన 20 రోజుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ వృద్దుడిపై కుక్కలు దాడి చేసి గాయపరిచాయి.
తాజాగా పశువులపై కూడా దాడి చేస్తున్నాయి. ఇలాంటి ఓ సంఘటన కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో చోటుచేసుకుంది. గేదెపై వీధ కుక్కలు దాడి చేసిన ఘటన జిల్లాలో ప్రజలను కలవర పెడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో వీధి కుక్కలు విపరీతంగా పెరిగాయి. రోడ్లపై గుంపులు గుంపులుగా సంచారం చేస్తూ జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
ఇరుకుల్ల గ్రామానికి చెందిన సంకరి కనకయ్య తన గేదెలను వ్యవసాయ బావి వద్ద కట్టేసి రాత్రి తిరిగి ఇంటికి వచ్చాడు. తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చూసే సరికి వీధి కుక్కలు గేదెపై పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. గమనించిన కనకయ్య కర్ర సహాయంతో వాటిని వెళ్లగొట్టేందుకు ప్రయత్నం చేశాడు. కుక్కలు తనపై దాడి చేసేందుకు యత్నించడంతో అక్కడి నుంచి తప్పించుకుని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వాదా సమాచారం అందించాడు.
దీంతో కుటుంబ సభ్యులు పెద్ద కర్రలతో వ్యవసాయ బావి వద్దకు చేరుకుని కుక్కలను కొట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాయి. వీధి కుక్కల దాడిలో గేదెకు తీవ్రగాయాలు అయ్యాయి. స్థానిక పశు వైద్యుడు డాక్టర్ రామకృష్ణకు కుటుంబ సభ్యులు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని సుమారు రెండు గంటల పాటు చికిత్స చేసి గేదె ప్రాణాలను కాపాడారు.