Cyber Crime : పోలీసులు ఆన్లైన్ నేరాలను కట్టడి చేయడానికి విస్తృతంగా ప్రయత్నిస్తున్నా.. అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధిక రాబడుల ఆశతో ఆన్లైన్లో పెట్టుబడులు పెడుతూనే ఉన్నారు. చివరికి మోసపోతూనే ఉన్నారు. ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. అయినా ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా చేసుకుని ఆన్ లైన్ లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురంతండాకు చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్ స్టోర్ను ప్రారంభించాడు. కస్టమర్ల నమ్మకాన్ని చూరగొని గతేడాది జూన్లో ఓ వెబ్సైట్ నెలకొల్పి అధిక రాబడి ప్రకటనలిచ్చాడు. నేలకొండపల్లికి చెందిన ఓ హోటల్ యజమాని, మరో ఐదుగురి సహాయంతో ఒక గ్రూప్ ను ఏర్పాటు చేశాడు. తన వెబ్సైట్లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో సొమ్ము రెట్టింపవుతుందని చెప్పాడు. మొదట్లో పెట్టుబడి పెట్టి లాగిన్ ఐడీలు తీసుకున్న టీం సభ్యులకు రెట్టింపు సొమ్ము ఇచ్చి వారి సాయంతో మార్కెట్లో విస్తృత ప్రచారం చేశారు. ఇందులో భాగంగానే బృంద సభ్యులకు డబ్బు జమచేసినట్టు సమాచారం.
లబ్ధి పొందిన కొద్దిమంది సభ్యులు కార్లు కొన్నారు. కొందరు టూర్లు తిరిగారు. ఈ వార్తలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో చాలామంది నూతనంగా పెట్టుబడి పెట్టి లాగిన్ ఐడీలు తీసుకున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలతోపాటు ఏపీలోని జగ్గయ్యపేట, నందిగామ, కంచికచర్ల, విజయవాడ ప్రాంతాల నుంచి దాదాపు రూ.10కోట్ల డిపాజిట్లు సేకరించారు. గడిచిన ఆరు నెలల్లోనే కంపెనీ రూ.8 కోట్ల టర్నోవర్ చేసిందని కొత్త కస్టమర్లకు ఆశలు కల్పిచారు. నేలకొండపల్లిలో కార్యాలయాలు మారుస్తూ వెబ్సైట్లో బెంగళూరుకు చెందిన చిరునామా పేర్కొన్నారు.
కస్టమర్లకు 200 రోజుల్లో సొమ్ము రెట్టింపని చెప్పి చేర్చుకుంటారు. ఉదాహరణకు రూ.5వేలతో ఒకరు లాగిన్ అయితే వారి పెట్టుబడి రూ.5వేలను విత్డ్రా అవకాశం లేకుండా హోల్డ్ చేస్తారు. దానిపై రోజువారీ కమిషన్ను వాలెట్లో జమచేస్తారు. వాస్తవమేంటంటే పెట్టుబడి పెట్టిన రూ.5వేలనే రోజూ కొంతమొత్తంగా జమచేస్తారు తప్ప అసలు రెట్టింపు మాటే ఉండదు. గడువు ముగిసినవారు అసలు సొమ్ము అడిగితే ఏరోజు లాభం ఆరోజు పడుతుంది కదా.. అసలు సొమ్మును విత్డ్రా చేసుకోవద్దని నచ్చచెబుతారు. సుమారు 600 మంది ఇప్పటికే చేరారు. టీంలు వేడుకలు నిర్వహించటంతో త్వరగా ప్రజలు ఆకర్షితులవుతారు.
పెట్టుబడి పెట్టిన వారికి నేలకొండపల్లి కేంద్రంగా అదే కంపెనీ పేరుతో ఓ చిట్ఫండ్ నిర్వహిస్తున్నట్లు ఆన్లైన్లో తయారుచేసిన నకిలీ రసీదును ఇచ్చేవారు. కోదాడకు చెందిన వ్యక్తి చేరితే అక్కడి అడ్రస్ పేరుతో నకిలీ రసీదు ఇచ్చారు. ఆన్లైన్లో అధిక రాబడుల పేరుతో డిపాజిట్ల సేకరణే మోసం. అనుమతి లేని చిట్ఫండ్ పేరుతో రసీదు ఇవ్వటం మరో మోసం. సదరు వ్యక్తులు నేలకొండపల్లిలో పలుచోట్ల నిర్వహించిన కార్యాలయాల్లో ఎక్కడా కంపెనీ వివరాలు ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. అసలు సొమ్ము వస్తుందా? రాదా అని కొందరు సందేహం వ్యక్తం చేస్తుండటంతో పోలీసులూ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. సైబర్ పోలీసులు వెంటనే స్పందించి వెబ్సైట్, బ్యాంకు ఖాతాలను పరిశీలించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకుంటే మరింతమంది మోసపోయే అవకాశం ఉండదు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారికి సాంకేతికత, ఆర్థిక లావాదేవీలపై అంత పట్టుందా? లేదా తెరవెనక ముఠాలు ఏవైనా ఉండి నడిపిస్తున్నారా? అనే అంశాలపై పోలీసులు విచారిస్తున్నారు.