Dhruv Jurel : 22 ఏళ్ల ధృవ్ జురెల్ పేరు.. ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోంది. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఎంపికైన ధృవ్ జురెల్ ఎవరని అందరూ నెట్టింట తెగ వెతికేస్తున్నారు. ఆ క్రమంలో వారికి ఒక కొత్త విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు. అదేమిటంటే ధృవ్ జాతీయ జట్టుకి ఎంపికైనట్టు తెలిసి భావోద్వేగానికి గురయ్యాడు.
ఈ క్రికెట్ కోసం తన కుటుంబాన్ని ఎంత ఇబ్బంది పెట్టానోకదా.. అని గుర్తుతెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడు. విషయం ఏమిటంటే చిన్నతనం నుంచి క్రికెట్ అంటే తనకి చాలా ఇష్టం. పేదరికం కారణంగా తండ్రి ఇష్టపడేవాడు కాదు.
ఆయన పేరు నెమ్ సింగ్ జురెల్, అంతేకాదు తను మిలట్రీ లో పనిచేసి కార్గిల్ వార్ లో పాల్గొన్నారు. హవల్దార్ గా పదవీ విరమణ పొంది వచ్చారు. అందువల్ల తనకి వచ్చే సంపాదనతో ఇల్లు గడవడమే వారికి కష్టంగా ఉండేది.
ధృవ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా. ఒకరోజున ఇంటిలో తెలీకుండా ఏకలవ్య స్టేడియంలోని క్రికెట్ క్యాంప్ లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. విషయం తెలిసి నాన్న చాలా సీరియస్ అయ్యాడని ధృవ్ తెలిపాడు. కానీ నేను మొండిపట్టు పట్టాను. ఆ క్షణం, ఆ వయసులో నా తండ్రి ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు. మొత్తానికి రూ. 800 పెట్టి నాన్న ఒక కొత్త బ్యాట్ కొనిచ్చారు.
దాంతోనే సరిపెట్టుకుని, కోచింగ్ క్యాంప్ లో జాయిన్ అయినట్లు తెలిపాడు. తర్వాత నాకు క్రికెట్ కిట్ కావల్సి వచ్చింది. క్రికెట్ లో ముందుకెళ్లాలంటే కిట్ చాలా అవసరం. మళ్లీ ఇంట్లో నాన్న సీరియస్ అయ్యారు. రూ. 6 వేలు అవుతుందంటే కష్టం, క్రికెట్ మానేయ్, అటు చదువులేదు, ఇటు ఆటలో ఏమవుతుందో తెలీదు. భవిష్యత్ పాడైపోతుందని తిట్టారు.
దాంతో బాత్ రూంలోకి తలుపు గడియపెట్టుకున్నానని అన్నాడు. తలుపు ఎంత కొట్టినా తీయలేదు. అలా తల్లిదండ్రులని బ్లాక్ మెయిల్ చేశానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ధృవ్ తల్లి పేరు రజనీ జురెల్, చెల్లి పేరు నీరూ జురెల్ అన్నమాట. ఎంతసేపటికి బాత్రూం నుంచి రాకపోయేసరికి అమ్మ మాటిచ్చింది. ధృవ్ , బయటకు రా, నేను నీకు కిట్ కొనిస్తానని అంది. అప్పుడు తలుపు తీశాను.
తర్వాత అమ్మ బయటకు వెళ్లి, తన బంగారు చైను ఒకటి అమ్మి, నాకు డబ్బులిచ్చిందని తెలిపాడు. అప్పుడు నా మనసులో ఒకటే అనుకున్నాను. మా అమ్మకి మాత్రం నేను గొప్ప క్రికెటర్ నై చూపిస్తానని ఒట్టు పెట్టుకున్నానని అన్నాడు. అలా పగలు రాత్రీ క్రికెట్ కోసం కష్టపడినట్టు తెలిపాడు.
2021లో సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో యూపీ తరఫున ధృవ్ ఆరంగ్రేటం చేశాడు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకున్నాడు. బ్రహ్మాండంగా ఆడాడు. అలా రంజీ ట్రోఫీలో సెలక్ట్ అయ్యాడు. అక్కడ ప్రదర్శన నచ్చి రాజస్థాన్ రాయల్స్ రూ.20 లక్షల కనీస ధరకు ధృవ్ ని కొనుగోలు చేసింది. దీంతో ఆర్థిక పరిస్థితి ఒక కొలిక్కి వచ్చింది. అమ్మా, నాన్న ఎంతో సంతోషించారని తెలిపాడు.
ఆర్ ఆర్ లో మంచి స్ట్రోక్ ప్లేయర్ గా, బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడే బీసీసీఐ దృష్టిలో పడ్డాడు. అది కూడా ఇషాన్ కిషన్ లేకపోవడంతో తన ప్లేస్ లో అవకాశం దక్కించుకున్నాడు.
ఇంక జీవితంలో గెలుపునకు ఆఖరి మెట్టు మీద ఉన్నాడు. 11మంది తుది జట్టులో స్థానం సంపాదించి, క్రికెట్ లో మంచి పేరు తెచ్చుకోడమే కాదు, దేశానికి కూడా తీసుకురాగలిగితే ఎంతో మందికి స్ఫూర్తివంతంగా నిలుస్తాడనడంలో సందేహమే లేదు.