Ganta Srinivasa Rao : మునిగిపోతున్న నావలాంటి వైసీపీ నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనేక మంది ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సమయంలో వైసీపీపై విమర్శలు గుప్పించారు.
‘‘ఎంపీలకు కూడా జగన్ కలిసే అవకాశం ఇవ్వడం లేదు. సీఎం జగన్ ను రెండుసార్లే కలిసినట్టు కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ చెప్పారు. పెనమలూరు సీనియర్ ఎమ్మెల్యే ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. అంబటి రాయుడు ఏవేవో ఊహించుకొని వైసీపీలోకి వెళ్లాడు. పరుగులు పెట్టకుండానే ఆయన బయటకు వచ్చేశారు. ఇప్పుడేమో జనసేనలో సీటు కోసం చూస్తున్నారు. ఎమ్మెల్యేల బదిలీలు ఇంత పెద్దఎత్తున ఎప్పుడూ జరగలేదు. 50 శాతం మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడే పరిస్థితి వచ్చింది. జనవరి 20న భీమిలి నుంచి జగన్ ప్రజాయాత్రలు ప్రారంభిస్తారట. ఆయనకు ప్రజల నుంచి ఛీత్కారాలు తప్పవు. ఉమ్మడి విశాఖలో ఒక్క స్థానంలో కూడా వైసీపీ గెలిచే అవకాశమే లేదు’’ అని గంటా శ్రీనివాసరావు చెప్పారు.