Retired DGP Baburao : తెలుగు జాతి రత్నం, నిజాయతీకి నిలువుటద్దం అయిన రిటైర్డ్ డీజీపీ బాబూరావుకు ప్రతిష్టాత్మక ఫ్రాన్స్ ఎకోల్ సుపరీయర్ రాబర్ట్ డీసోర్బన్ యూనివర్సిటీ.. గౌరవ డాక్టరేట్ అందించింది. భారతదేశంలో ఎంతోమంది ప్రముఖలకు అందించిన ఈ అవార్డ్ ఇప్పుడు బాబూరావును వరించింది. అంబేద్కర్ ఆశయాలతో పోలీస్ అధికారిగా ఆయన ప్రజలకు చేసిన సేవలను గుర్తించిన ఈ యూనివర్సిటీ.. భారత్ సమ్మాన్ అవార్డ్ తో పాటు గౌరవ డాక్టరేట్ ను ఈనెల 12వ తేదీన దుబాయ్ వేదికగా అందించింది. మధ్యప్రదేశ్ కేడర్ లో ఐపీఎస్ అయి.. దళిత జాతి నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగి అడిషనల్ డీజీపీ హోదాలో ఎంతోమందికి సేవ చేసిన కూచిపూడి బాబూరావును ఇప్పుడు డాక్టరేట్ వరించింది.
గుంటూరు జిల్లా అమృతలూరు మండలం పెదపూడి గ్రామంలో శ్రీ కూచిపూడి ప్రకాశం, అనంతమ్మ దంపతలుకు జన్మించారు బాబూరావు. ఆయన తల్లిదండ్రులిద్దరూ ఉన్నత విద్యావంతులు. ఇద్దరూ ఉపాధ్యాయులుగా పని చేశారు. ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఆంధ్రా యూనివర్సిటీ నుంచి ఎమ్ ఏ పూర్తి చేశారు. 1980లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీవోగా పని చేశారు. 1991లో ఆయన మధ్యప్రదేశ్ కేడర్ ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు. అప్పటి నుంచి మధ్యప్రదేశ్ లో ఐపీఎస్ అధికారిగా అనేక హోదాల్లో పని చేసి ప్రజలకు చేరువయ్యారు బాబూరావు.
36 ఏళ్లపాటు పోలీస్ అధికారిగా మచ్చలేని వ్యక్తిగా.. ప్రజాసేవలో తన జీవితాన్ని మమేకం చేశారు. అక్కడ కరడుగట్టిన క్రిమినల్స్ నేరస్వభావాన్ని మార్చడానికి విపరీతంగా ప్రయత్నించారు. అలాగే వివిధ నేరాల్లో చిక్కుకుని జైలుపాలయిన నేరస్తుల కుటుంబసభ్యులకు అండాదండగా నిలిచారు. కుటుంబపెద్ద నేరం చేసి జైలు కెళ్తే.. మిగిలిన కుటుంబ సభ్యులంతా ఆర్థికసమస్యలతో సతమతమవుతున్న విషయం తెల్సుకుని.. బాబూరావు వారందరినీ అనేక రకాలుగా ఆదుకున్నారు. నేరస్తుల పిల్లల్ని చదివించడమే కాకుండా.. వారు ఉన్నత స్థానాలకు చేరుకునేలా ప్రోత్సహించారు.
అడిషనల్ డీజీపీ హోదాలో ఆయన రిటైర్ అయ్యారు. ప్రజాసేవలో ఆయన సేవాభావ ధృక్పథం, ప్రజలకు సేవ చేయడంలో ఆయన పడిన తపనను కోల్ సుపీరియర్ రాబర్ట్ డీ సోర్బన్ యూనివర్సిటీ గుర్తించింది. ఆయనకు గౌరవ డాక్టరేట్ ను ప్రధానం చేయాలని నిర్ణయించింది. భారతదేశం నుంచి ఈ భారత్ సమ్మాన్ అవార్డ్, గౌరవ డాక్టరేట్ ను ఇంతకుముందు అనేకమంది ప్రముఖులు అందుకున్నారు..
భారత విదేశీవ్యవహారాల శాఖమంత్రి శ్రీమతి డాక్టర్ మీనాక్షిలేఖి, ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని తయారు చేసిన పద్మభూషణ్ డాక్టర్ రామ్ సుతార్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్, సినీ నటుడు డాక్టర్ అంజన్ శ్రీవాస్తవ్, బాలీవుడ్ నటుడు సోనూసూద్, కాంగో రక్షణమంత్రి డాక్టర్ సిల్వైన్ ముటోమ్ డో, దుబాయ్ ఫార్మసీ మంత్రి డాక్టర్ అలీ అల్ సయ్యద్ హుస్సేన్, ఇండియన్ క్రికెటర్ హర్బజన్ సింగ్ లాంటి ఎంతోమంది ప్రముఖులు ఈ ఆవార్డును పొందారు. ఇప్పుడు అదే లిస్టులో మన తెలుగు జాతి రత్నం కూచిపూడి బాబూరావు చేరారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తులకు మాత్రమే ఈ అవార్డ్, డాక్టరేట్ లభిస్తుంది. ఇప్పుడు అదే అవార్డ్ ను అందుకున్న బాబూరావు తెలుగుజాతికి గర్వకారణంగా నిలిచారు.