Mudragada Padmanabham : ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలపై వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలో కీలక నేతలకు గాలం వేస్తున్నాయి. కుల సమీకరణాలు ఆధారంగా పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ నేతలు చక్కర్లు కొడుతున్నారు.
కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ తొలుత వైసీపీలో చేరతారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో టీడీపీ-జనసేన నేతలు పావులు కదిపారు. జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ రెండు రోజుల క్రితం ముద్రగడను కలిశారు. ఆయనతో చర్చలు జరిపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పంపిన సందేశాన్ని ఆయనకు వివరించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ముద్రగడ ఇంటికి వెళ్లడం ఆసక్తిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు దూతగానే జ్యోతుల నెహ్రూ.. ముద్రగడ ఇంటికి వచ్చారనే చర్చ జరిగింది.
తాజాగా జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి ముద్రగడను కలవడం ఆసక్తికరంగా మారింది. పవన్ నే స్వయంగా కిర్లంపూడి వచ్చి ముద్రగడను కలుస్తారనే బొలిశెట్టి వెల్లడించారు. ఈ నెల 20 లేదా 23న ముద్రగడతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని తెలిపారు.