Mallikarjun Kharge : విపక్షాల కూటమి ‘ఇండియా (INDIA bloc)’ నేతలు లోక్సభ ఎన్నికలు (Lok sabha Elections 2024) సమీపిస్తున్న వేళ మరోసారి సమావేశమయ్యారు. వర్చువల్గా జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సహా పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో‘ఇండియా’ కూటమి ఛైర్మన్ గా అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)ను ఎన్నుకున్నారని తెలుస్తోంది.
ఈ పదవికి జేడీయూ నేత, బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కూడా పోటీ పడ్డాయి. నితీశ్కు కూటమి కన్వీనర్ పదవిని అప్పగించగా.. దాన్ని ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేతకే ఆ పదవి కూడా ఇవ్వాలని నితీశ్ సూచించారని సమాచారం.
కూటమిని బలోపేతం చేయడం, భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు లాంటి అంశాలపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. సీట్ల సర్దుబాటుపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఈ భేటీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ హజరు కాలేదు.
కూటమి ఛైర్మన్ గా ఖర్గే ఎంపికవడంతో వచ్చే లోక్సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఆయననే ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా ఖర్గేనే ఉండాలంటూ మమతా బెనర్జీ, కేజ్రీవాల్తో సహా మరికొందరు నేతలు ప్రతిపాదించారు. అయితే, దీనిని ఖర్గే సున్నితంగా తిరస్కరించారు. ముందు ఎన్నికల్లో విజయంపై దృష్టి సారిద్దామని, ఆ తర్వాతే అభ్యర్థిని నిర్ణయిద్దామని ఖర్గే సమావేశంలో స్పష్టం చేశారు.