Divya Pahuja : మాజీ మోడల్ దివ్య పాహుజా హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జనవరి 2న గురుగ్రామ్లోని హోటల్లో కొందరు వ్యక్తులు ఆమెను కాల్చి చంపారు. మృతదేహాన్ని తరలిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. హోటల్ యజమాని అభిజీత్ సింగ్తో పాటు ఇద్దరిని అరెస్టు చేశారు.
అప్పటి నుంచి ఆమె మృతదేహం కోసం పోలీసులు గాలించారు. 11 రోజుల తర్వాత హర్యానాలోని ఓ కాలువలో మృతదేహన్ని గుర్తించారు. హత్య జరిగిన తర్వాత దివ్య శవాన్ని నిందితులు పంజాబ్లోని భాఖ్డా కెనాల్లో పడేశారని పోలీసులు వెల్లడించారు. అలా నీటిలో మృతదేహం హర్యానాకు కొట్టుకొచ్చినట్లు తెలిపారు. తొహానా జిల్లాలోని కాలువ నుంచి మృతదేహాన్ని పోలీసులు బయటకు తీశారు. పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
తన అభ్యంతకర ఫొటోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నందువల్లే దివ్యను చంపానని అభిజీత్ విచారణలో చెప్పాడని పోలీసులు పేర్కొన్నారు. ఐదుగురు వ్యక్తులు ఆమెను హోటల్కు తీసుకెళ్లి తుపాకీతో కాల్చారని గుర్తించారు.
హర్యానాలో గ్యాంగ్స్టర్ సందీప్ గడోలీతో దివ్యకు సంబంధాలున్నాయని పోలీసులు తెలిపారు . 2016లో ముంబయిలో జరిగిన ఎన్కౌంటర్లో సందీప్ మరణించాడు. సందీప్ ప్రత్యర్థి అయిన బిందర్ గుజ్జర్ అనే గ్యాంగ్స్టర్ హర్యానా పోలీసులతో కుమ్మక్కై నకిలీ ఎన్కౌంటర్ చేయించాడని తేలింది. బిందర్ కుట్రలో భాగంగానే సందీప్ను ఆమె అక్కడికి తీసుకువచ్చిందని అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ఆమె ఏడేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించిందని పోలీసులు వెల్లడించారు.