Falaknuma : వెండితెరపై నటుడిగా వెలగాలనుకున్నాడు. అవకాశాలు రాక ఆ వ్యక్తి డ్రగ్స్ స్మగ్లర్ గా మారాడు. డ్రగ్స్ దందా చేస్తూ నగర టాస్క్ఫోర్స్, ఫలక్నుమా పోలీసులకు చిక్కాడు. డీసీపీ పి.సాయిచైతన్య వెల్లడించిన వివరాలు ప్రకారం.. హైదరాబాద్ లోని ఫలక్నుమాకు చెందిన మహ్మద్ అమీర్(33) అనే యువకుడు ఏడాది క్రితం ముంబయి వెళ్లాడు. అక్కడ మోడలింగ్, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు.
కొన్ని సినిమాల్లో చిన్న వేషాలు వేశాడు. ఆ సమయంలోనే డ్రగ్స్ కు అలవాటుపడ్డాడు. అక్కడ వచ్చే సంపాదన సరిపోక తిరిగి హైదరాబాద్ కు వచ్చాడు. రియల్ ఎస్టేట్ దళారీగా ఉపాధి చూసుకున్నాడు. ఆ డబ్బులు సరిపోకపోవటంతో కొత్త పథకం వేశాడు.సినిమాల కోసమని విమానంలో ముంబయికి వెళ్లేవాడు. 20-40 గ్రాముల ఎండీఎంఏ కొనుగోలు చేసి ప్రైవేటు బస్సుల్లో హైదరాబాద్ కు వస్తుండేవాడు. గ్రాము ఎండీఎంఏ రూ.4000లకు కొనుకుని వచ్చి ఇక్కడ రూ.8000 నుంచి రూ10,000 వారకు అమ్మేవాడు.
4 నెలలుగా ప్రతి నెలా 2 సార్లు వెళ్లి వచ్చేవాడు. ఇతడి కదలికలపై టాస్క్ఫోర్స్, ఫలక్నుమా పోలీసులు నిఘా పెట్టారు. శుక్రవారం వట్టేపల్లి వద్ద కేశవగిరికి చెందిన జుబేర్ అలీ(27)కు ఎండీఎంఏ విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ముంబయికు చెందిన ప్రధాన సరఫరాదారుడు రెహాన్ పటేల్ వద్ద డ్రగ్స్ కొనుగోలు చేశాడని నిర్ధారించారు. మహ్మద్ అమీర్, జుబేర్ అలీలను ఫలక్నుమా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.