YS Sharmila : టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి, కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి ఆమె వెళ్లారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని చంద్రబాబును కోరారు.
చంద్రబాబుతో తన భేటికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని షర్మిల స్పష్టం చేశారు. తన కుమారుడు పెళ్లికి చంద్రబాబును పిలించేందుకు మాత్రమే వెళ్లానన్నారు. గతంలో తన కుటుంబంలో పెళ్లిళ్లకు చంద్రబాబును వైఎస్ఆర్ పిలిచారని గుర్తుచేశారు. క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్కు స్వీట్లు కూడా పంపిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దని కోరారు. కేటీఆర్, కవిత, హరీశ్రావుకు కూడా స్వీట్లు పంపానని అన్నారు.
“రాజకీయం అనేది మా జీవితం కాదు, అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం కానీ.. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇష్టం. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్ఆర్ అనేవారు. రాహుల్ ప్రధాని అయితేనే దేశంలో మతకలహాలు తగ్గుతాయి’’ అని షర్మిల అన్నారు.