Tigers Death Case : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా.. కాగజ్ నగర్ కారిడార్ లో పులులు మృతి చెందిన వ్యవహరం హాట్ టాపిక్ గా మారింది. దరిగాం అటవీ ప్రాంతంలో పులి మరణానికి.. రెండిటి మధ్య జరిగిన ఆదిపత్య పోరు కారణం కాదని.. ఎవరో మాటు వేసి మందు పెట్టి రెండు బెబ్బులను హతమార్చారని తేలడంతో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఎన్టీసీఏ, పీసీసీఎఫ్ చీఫ్ ఆర్ఎం డెబ్రియాల్ రంగంలోకి దిగి విచారణ చేపట్టడంతో అసలు గుట్టు రట్టైంది. ఇక ఈ కేసులో విష ప్రయోగానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించగా.. తల్లిదండ్రుల హామీతో మరో మైనర్ బాలుడిపై నిఘా ఉంచి.. వదిలిపెట్టినట్టు సమాచారం అందుతుంది.
కాగా ఇప్పటికే పులులు చనిపోయింది పశువు మాంసం తినడం కారణంగానేనని.. ఆ పశువు చనిపోయాక దానిపై గడ్డి మందు చల్లి, విషగులికలు కలిపారని.. అందువల్లే పులులు హతమయ్యాయని అధికారుల విచారణలో తేలింది. అయితే చనిపోయింది రెండు పులులే అయినా.. మరో రెండు పులులు మిస్ అవడంతో.. ఈ వ్యవహారం మరింత తీవ్ర రూపం దాల్చింది. దీంతో కనిపించకుండా పోయిన ఆ రెండు పులుల ఆచూకీ కోసం హైలెవల్ సర్చ్ ఆపరేషన్ ను అటవీ శాఖ అధికారులు చేపడుతున్నారు. ఆరు డివిజన్ల పరిధి లోని అటవీ శాఖ సిబ్బంది దరిగాం అడవిని జల్లెడ పడుతూ పులి జాడ కోసం వెతుకులాడుతున్నారు.