Nagarkurnool : భార్య భర్తలన్నాక గొడవలు సహజం. అయితే కొన్నిసార్లు ఆ గొడవలు తారా స్థాయికి చేరుతాయి. కాస్త నెమ్మదిగా ఆలోచిస్తే.. ఇద్దరి మధ్యన వచ్చిన మనస్ఫర్థలు సద్దుమణుగుతాయి. కానీ.. నువ్వెంతంటే నువ్వెంతనుకుంటే మనస్తాపానికి గురై.. ప్రాణాలు తీసుకుంటున్నారు. అలా భర్తతో కొన్నాళ్లుగా గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. అందుకు భర్తే కారణమంటూ మృతురాలి బంధువులు అతడిని కొట్టి చంపారు. ఈ దారుణ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింధు, నాగార్జున అనే దంపతులు మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. దాంతో సింధు మనస్తాపం చెంది శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే బంధువులు ఆమెను నాగర్కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా సింధు మృతి చెందింది. మృతదేహంతో బంధువులు అచ్చంపేటకు తిరిగి వచ్చారు. ఆమె మృతికి భర్తే కారణమంటూ సింధు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఆమనగల్లు వద్ద భర్త నాగార్జునను కొట్టిచంపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.