Ayodhya Ram Mandir : అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రారంభ కార్యక్రమం దెబ్బకి పలు విమానయాన, ఆతిథ్య రంగంలోని కంపెనీల షేర్లు స్టాక్ మార్కెట్లో పైపైకి దూసుకుపోతున్నాయి. దేశ విదేశాల్లోని లక్షలాది మంది రాబోయే రోజుల్లో అయోధ్యను సందర్శించే అవకాశం ఉండటంతో మన్ముందు కూడా ఈ షేర్ల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఆర్సీటీసీ : భారత ప్రభుత్వ రైల్వేకు చెందిన ఈ సంస్థ.. జనవరి 19 నుంచి అయోధ్యకు వంద రోజుల పాటు 1000 ప్రత్యేక రైళ్లను నడపనుంది. అంతేగాక దేశంలోని 430 పట్టణ, నగరాల గుండా ప్రయాణించే 72 రైళ్లు నేరుగా అయోధ్యలో నూతనంగా నిర్మితమైన రైల్వే స్టేషన్ వరకు నడవనున్నాయి. ఇవిగాక మరో 300కి పైగా రైళ్లు అయోధ్య సమీప ప్రాంతానికి వేయనున్నారు. దీంతో ఈ సంస్థ అందించే టికెటింగ్, క్యాటరింగ్, టూరిజం సేవలకు డిమాండ్ పెరగనుంది. రైల్వే స్టాక్పై ఇది బలమైన ట్రెండ్ను క్రియేట్ చేయగలుగుతుందని, దీని షేర్ ఇప్పుడు ఊగిసలాడుతున్న రూ. 870 నుంచి రూ.975 స్థాయికి వెళ్లే ఛాన్స్ ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండిగో : భారత అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో.. జనవరి 15 నుంచి రోజూ ముంబై నుంచి అయోధ్యకు విమాన సర్వీసులను ప్రారంభించనుంది. గత డిసెంబరులో ప్రారంభమైన ఢిల్లీ – అయోధ్య విమానసేవల వల్ల సంస్థ స్టాక్స్పై సానుకూల ప్రభావం చూపాయని, షేర్ విలువ రూ. 3150 నుంచి రూ. 3180 దిశగా సాగుతోందని, ఇది మరింత పెరిగే అవకాశముందని నిపుణుల అంచనా.
ఇండియన్ హోటల్స్ : టాటా గ్రూప్ కంపెనీ వివాంటా, జింజర్ బ్రాండ్స్ కింద టెంపుల్ టౌన్లో 2 లగ్జరీ హోటళ్లను నిర్మించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీంతో షేర్ ధరలో బుల్లిష్ బయాస్ ఉంది. ఇది ప్రైమరీ అప్ ట్రెండ్ని సూచిస్తూ అధిక గరిష్టాలు, కనిష్ట స్థాయిల శ్రేణిని ఏర్పరుస్తుందని నిపుణుల అంచనా.
ప్రవేగ్ఖ : అయోధ్యలో ఇప్పటికే భారీ రిసార్టును నిర్మించిన ఈ కంపెనీ.. అక్కడ మరో రిసార్టును ఆరంభించనుంది. రామమందిర ప్రారంభ సమయాన దీనికి భారీగా బుకింగ్లు జరిగాయి. గత మూడు నెలలుగా ఈ కంపెనీ షేర్ విలువ బాగా పుంజుకుంది.
ఈజ్ మై ట్రిప్: యాత్రికుల టూర్ ప్యాకేజీలను అందించే ఈ కంపెనీ భవిష్యత్తులో అయోధ్యలో ఆతిథ్య రంగం విస్తరణావకాశాలను అందిపుచ్చుకునేందుకు పెట్టుబడులకు సిద్దమైంది. దీంతో ఈ కంపెనీ షేర్ కూడా పుంజుకుంటోంది.
థామస్ కుక్ : ముంబై కేంద్రంగా సేవలందించే ఈ ట్రావెల్ ఏజెన్సీ షేరు కూడా అయోధ్య ఈవెంట్ నేపథ్యంలో బలమైన అప్ట్రెండ్ను కొనసాగిస్తోంది. ఇటీవలి స్వల్ప కరెక్షన్ తర్వాత 135 జోన్కు చేరిన ఈ షేర్ మున్ముందు మరింత పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.