Rajendra Nagar : సంక్రాంతి పండుగ సెలవుల్లో ఓ కుటుంబంలో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని అత్తాపూర్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్తో 11 ఏళ్ల బాలుడు తనిష్క్ మృతిచెందాడు.
సంక్రాంతి సెలవులు కావడంతో గాలి పటాలు ఎగుర వేయడానికి తన ముగ్గురు స్నేహితుల తో కలిసి మిద్దె మీదకు వెళ్లాడు. ఈ క్రమంలో గాలిపటం విద్యుత్ వైర్లకు తగిలి కరెంట్ షాక్తో బాలుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తల్లిదండ్రులు హుటాహుటిన తనిష్క్ ను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందాడని వైద్యలు ధృవీకరించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాలిపటం ఎగురవేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానిక పిల్లలకు సూచించారు. సెలవుల్లో పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని పోలీసులు తల్లిదండ్రులను హెచ్చరించారు. తమ గారాల పట్టి.. ఇక కనిపించడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.