Ayodhya Ram Mandir : జనవరి 22న అయోధ్య రామమందిరంలో కొలువుదీరనున్న రామచంద్రుడికి మన తిరుపతిలో చదువుకున్న వేద విద్యార్థి మోహిత్ పాండే.. పూజారిగా సేవలందించబోతున్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జన్మించిన పాండే.. బాల్యం నుంచే వేద విద్యను అభ్యసించారు.
రామాలయంలో పూజా విధుల నిర్వహణ కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన 3,000 మందిని బృందావన్కు చెందిన హిందూ మత బోధకుడు జైకాంత్ మిశ్రా, అయోధ్య ప్రధాని పూజారి సత్యేంద్ర దాస్తో బాటు నందిని శరణ్ అనే మహంతుల బృందం రాత పరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి 50 మందిని ఎంపికచేసింది. వీరిలో మోహిత్ ప్రధానాలయ పూజారిగా ఎంపికయ్యారు.
మోహిత్ పాండే..ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ (ఆచార్య) చదువుతున్నారు. తర్వాత ఇక్కడే Ph.D చేసేందుకు సిద్ధమవుతున్నాడు.
ఆలయ ప్రారంభానికి 6 నెలల ముందునుంచే మోహిత్ పాండే అయోధ్య ఆలయ పూజారి విధివిధానాలకు సంబంధించిన శిక్షణను పొందుతున్నారు. సామవేద పండితుడైన మోహిత్.. తిరుపతిలో మాస్టర్స్లో చేరే ముందు ఏడేళ్ల పాటు ఘజియాబాద్లోని దూదేశ్వర్ వేద్ విద్యాపీఠ్లో వేద విద్యను అభ్యసించారు.
అయోధ్య ప్రస్తుత ప్రధాన పూజారి సత్యేంద్రదాస్ వయసు ప్రస్తుతం 83 ఏళ్లు. గత 32 ఏళ్లుగా ఈయనే అయోధ్యలో ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. 1992లో జరిగిన బాబ్రీ విధ్వంసానికి సరిగ్గా 9 నెలల ముందు నెలకు రూ.100 వేతనం మీద అర్చక బాధ్యతలు స్వీకరించారు. 2019లో ఈయన వేతనం రూ. 13 వేలు. ఈయన 1975లో సంస్కృత విద్యాలయం నుండి ఆచార్య డిగ్రీని పొంది, 1976లో అయోధ్య సంస్కృత కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.
నూతన రామాలయానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. మహంత్ సత్యేంద్రదాస్ తర్వాత ప్రధాన పూజారిగా ఆ స్థానంలో సేవలందించేందుకు అన్వేషణ మొదలైంది. దీనికోసం ఎందరో అనుభవజ్ఞులు పోటీ పడినా.. చివరికి రామయ్యను సేవించుకునే భాగ్యం 22 ఏళ్ల మోహిత్ పాండేకు దక్కింది.